స్థలాల క్రమ బద్దీకరణకు ఎల్ఆర్ఎస్ గొప్ప అవకాశం: కేటీఆర్

198
ktr
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్​ (ఎల్ఆర్ఎస్​) ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు కోరారు. ఇప్పటి వరకు అనధికారిక లేఅవుట్లలో తెలియక ఫ్లాట్ లను కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్​ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం ఎల్ఆర్ఎస్​ స్కీమ్​ ఆన్​లైన్​, మీ సేవ సర్వీసులను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్​ సంబంధించిన అంశాలపై ప్రజా అవగాహన కోసం రూపొందించిన ఆ పోస్టర్​ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఉన్న అనధికారిక ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ఇదే మంచి అవకాశమని ఆయన తెలిపారు.

ఈ ఏడాది అక్టోబర్​ 15వ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఎల్ఆర్ఎస్​ స్కీమ్​ ద్వారా భూ యజమానులు పూర్తిస్థాయి హక్కులను పొందడంతో పాటు ప్రభుత్వ పరంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలను పొందడానికి అర్హులవుతారని వివరించారు.వచ్చే అక్టోబర్ 15వ తేదీ వరకు గడువు లోగా దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణ ఫీజును వచ్చే ఏడాది(2021) జనవరి 31వ తేదీ లోగా పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ప్రభుత్వ స్థలాలకు, అర్బన్ ల్యాండ్ సీలింగ్​ మిగులు భూములకు, దేవాదాయ భూములకు, చెరువుల శిఖం భూములు లలో ఉన్న ప్లాట్లకు ఎల్ఆర్ఎస్​ స్కీమ్​ వర్తించదని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్​ కుమార్​, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, వాటర్​ వర్క్స్​ మేనేజింగ్​ డైరెక్టర్​ ఎం.దానకిషోర్​ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -