తమిళనాడు ప్రజలకు డిసెంబర్ నెల అంటే వణుకుపుడుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఘటనలు చూస్తే తమిళ ప్రజలకు డిసెంబర్ నెల కలిసిరాలేదన్నది స్పష్టమవుతోంది. రెండు నెలలకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత చివరకు ఈనెలలోనే గుండెపోటుతో మరణించడంతో డిసెంబర్ సెంటిమెంట్ మరోసారి నిజమైందని తమిళ ప్రజలు భయపడుతున్నారు.
డిసెంబర్ నెల తమిళనాడు ప్రజలను శోకసంద్రంలోకి నెట్టింది. 1987 డిసెంబర్ 24న తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఎంజీఆర్ డిసెంబర్లోనే మరణించారు. భారత చివరి గవర్నర్ జనరల్గా సెవలందించిన సి. రాజగోపాలా చారి కూడా 1972 డిసెంబర్ 25నే మృతి చెందారు. ప్రముఖ హేతువాద నాయకుడు పెరియార్ స్వామికూడా 1973 డిసెంబర్ 24న కన్నుమూశారు. వీరంతా తమిళనాడుకే చెందినవారు కావడం గమనార్హం.
ఆ తర్వాత 2004 డిసెంబర్ 26న తమిళనాడులో సునామీ వచ్చింది. మొన్నటికి మొన్న 2015 నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో చెన్నై వరదలతో కుదేలైంది. వందల మంది నిరాశ్రయులయ్యారు. చెన్నైలో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. పులిహోర ప్యాకెట్ల కోసం ప్రజలు దీనంగా ఎదురుచూసిన పరిస్థితి. ఇంతటి ఉపద్రవం నుంచి తట్టుకుని తమిళనాడు కోలుకుంది. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ ప్రజల్లో మాత్రం డిసెంబర్ నెల సెంటిమెంటుగా మారిపోయింది.
డిసెంబర్ నెల వస్తేనే తమిళ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. దాదాపు రెండు నెలలకు పైగా జయలలిత ఆస్పత్రిలోనే ఉన్నారు. జయ ఆరోగ్యం గురించి శుభవార్త వస్తోందని ఆశించిన తమిళ ప్రజలకు తీవ్ర నిరాశే ఎదురైంది. డిసెంబర్ 5న రాత్రి 11.30 అమ్మ కన్నుమూశారంటూ అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో డిసెంబర్ నెల పేరు వింటేనే తమిళ ప్రజలు బిక్కు బిక్కు మంటూ భయపడిపోతున్నారు.