సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు వరుసగా షాక్ లు ఎదురవుతున్నాయి. ఇటివలే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ టీఆర్ ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అది మరువకముందే మరో కీలక నేత పార్టీ వీడనున్నట్లు ప్రచారం జరగుతుంది. హైదరాబాద్ లో కీలక నేతగా వ్యవహారిస్తోన్న ముఖేష్ గౌడ్ కూడా గులాబీ కండువా కప్పుకొనున్నాడని తెలుస్తోంది.
హైదరాబాద్ లో మంచి పట్టున్న ముఖేష్ గౌడ్ పార్టీ వీడటంతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందని చెప్పుకోవచ్చు. గత 35సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ తిరుగలేని నేతగా పేరు సంపాదించుకున్నాడు ముఖేష్ గౌడ్. 15సంవత్సారాలు ఎమ్మెల్యేగా, 7ఏళ్లు మంత్రిగా పనిచేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హైదరాబాద్ లోని గోషా మహాల్ నియోజకవర్గం నుంచి ముఖేష్ గౌడ్ ప్రాతినిధ్యం వహించాడు. గత ఆరునెలల నుంచి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్ తనవైపు తిప్పుకుంటున్నాడు.
త్వరలోనే గోషామహాల్ నియోజక వర్గ బాధ్యతలను తనయుడు విక్రమ్ గౌడ్ కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ నేతలతో విక్రమ్ గౌడ్ సమావేశాలు ఏర్పాటుచేసుకుంటూ నిత్యం ప్రజల్లో తిరుగుతున్నాడు. ఇక గత ఆరు నెలలనుంచి టీఆర్ఎస్ కు చెందిన ఓ మంత్రి ముఖేష్ గౌడ్ తో చర్చలు జరుపుతున్నారని అవి సఫలం కావడంతో త్వరలోనే గులాబీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ముఖేష్ గౌడ్ తన అనుచరులతో సమావేశం నిర్వహించి చర్చించారని సమాచారం.
గత 15ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా అవతరించిన ముఖేష్ గౌడ్ తన పుట్టిన రోజు జులై1న రాజకీయ భవిష్యత్ పై ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇందు కోసం అతని అనుచరులు అన్నీఏర్పాట్లును ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ ఎస్ లో చేరిన అనంతరం గోషామహల్ నియోజకవర్గంలో పాదయాత్రలు చేసి ప్రజల్లో తిరుగువచ్చని ప్రచారం జరగుతుంది. ముఖేశ్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరితే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో ఎదురుదెబ్బే అని చెప్పుకొవచ్చు.