మురళీ దర్శకత్వంలో ఎస్‌కేఎస్ క్రియేషన్స్

98
- Advertisement -

ఎస్ కే ఎస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న కొత్త సినిమా ఇవాళ హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హ్యూమన్ వాల్యూస్ ఉన్న ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని రాహుల్ శ్రీవాత్సవ్ ఐయ్యర్ ఎన్ నిర్మిస్తున్నారు. మురళీ అలకపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఆంజనేయులు జక్క ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్ర ప్రారంభోత్సవ ముహూర్తపు సన్నివేశానికి దేవుడి పటాలపై సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు క్లాప్ నిచ్చారు. మరో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.ఈ సందర్భంగా నిర్మాత రాహుల్ శ్రీవాత్సవ్ ఎన్ మాట్లాడుతూ – మా ఎస్ కే ఎస్ క్రియేషన్స్ సంస్థను 2019లో ప్రారంభించాం. మా ప్రొడక్షన్ నుంచి వస్తున్న మూడో చిత్రమిది. మా మొదటి సినిమా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. రెండవ చిత్రాన్ని ఫిబ్రవరిలో మొదలుపెట్టాం. ప్రస్తుతం ఆ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఇవాళ మూడో సినిమాకు శ్రీకారం చుట్టాం. దర్శకుడు మురళి చెప్పిన కథ నచ్చి ఈ సినిమాను ప్రారంభించాం. ఇవాళ మా మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేశాం. 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర ఈ సినిమా స్టోరీ పాయింట్ గురించి విని ఉంటారు. ఇది ఏ సినిమాకూ కాపీ కాదు. ఫ్రెష్ లవ్ స్టోరీ. ఈ కథను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాం. మూడు పాత్రల మధ్య సాగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. ముక్కోణపు ప్రేమ కథ అనే కంటే ప్రేమ, జీవితంలోని భావోద్వేగాలు ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పవచ్చు. ఆ ప్రేమ ఎలా విజయ తీరం చేరిందనేది ఆసక్తికరంగా మా దర్శకుడు తెరకెక్కించబోతున్నారు. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో వెల్లడిస్తాం. పేరున్న నటీనటులు నటిస్తారు. వారు ఎవరు అనేది ఇప్పటికి సీక్రెట్ గా ఉంచుతున్నాం. మే రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జూన్ జూలైలో చిత్రీకరణ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆంజనేయులు జక్క మాట్లాడుతూ – రాహుల్, మురళీ నేను కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ తో మీ ముందుకు వస్తున్నాం. కొత్త కథా కథనాలతో సాగే ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. పేరున్న నటీనటులు మా సినిమాలో నటించబోతున్నారు. సినిమా ప్రారంభించిన నాలుగు నెలల్లోనే రిలీజ్ తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారు.దర్శకుడు మురళీ అలకపల్లి మాట్లాడుతూ – నేను కూడా మన మీడియా కుటుంబంలోని వ్యక్తినే. ఇవాళ దర్శకుడిగా ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది. గ్రామీణ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ముగ్గురు పర్సన్స్ మధ్యన జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ కు ఈ కథ చెప్పగానే సబ్జెక్ట్ కొత్తగా ఉంది అని సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఒక మంచి మూవీ తో త్వరలోనే మీ ముందుకు వస్తాం అన్నారు.

Also Read:ఓటీటీలోకి గోపీచంద్ “భీమా”

- Advertisement -