ఆలయాలతో ఆధ్మాత్మిక చింతన లభిస్తుందని, ఆలయాలకు రావడం వలన భక్తుల్లో ధార్మిక చింతన పెరిగి మానసిక ప్రశాంతత కలుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్ క్యాంప్ రూ. 25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న శ్రీ రామాలయ నిర్మాణానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వేదపండితుల మంత్రోఛ్చారణల మధ్య ఆలయ భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు పురాతన ఆలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించి వాటికి పునర్వైభవం తీసుకువస్తుందని అన్నారు. ఉమ్మడి పాలనలో మన ఆలయాలు నిరాధారణకు గురయ్యాని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధి ద్వారా ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రూ. 12 వందల కోట్లతో యదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని తలపెట్టారని, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా.. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి రూపుదిద్దుకుంటుందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తుందని తెలిపారు. ప్రజల్లో భక్తి భావన పెరిగి ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందని, గ్రామాల్లో ఆలయా నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా బాన్సువాడ నుండి బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తులకు సౌకర్యాలు మెరుగుపరుస్తామని వెల్లడించారు.గతంలో అర్చకులకు, ఆలయ సిబ్బందికి సరిగా జీతాలు కూడా చెల్లించని పరిస్థితి ఉండేదని, తెలంగాణ ప్రభుత్వ హాయంలో వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను చెల్లిస్తున్నామన్నారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ ద్వారా సింగూర్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి నీటిని తరలించేలా సీయం కేసీఆర్ ను ఒప్పించి ప్రాజెక్ట్ లో పుష్కలంగా నీరు ఉండేలా పోచారం తమవంతు కృషి చేశారని తెలిపారు.