ఇంటలిజెన్స్ హెచ్చరించినట్లుగానే జరిగింది. అత్యాచారం, హత్యకేసులో సీబీఐ కోర్టు గుర్మీత్ సింగ్ను దోషిగా తేల్చడంతో ఆయన అనుచరులు, మద్దతుదారులు సంయమనం కోల్పోయారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో విధ్వంసానికి దిగారు. సుమారు వందకుపైగా వాహనాలకు నిప్పు పెట్టిన గుర్మీత్ మద్దతుదారులు ఓ అగ్నిమాపక వాహనాన్ని సైతం తగులబెట్టారు.
ఈ అల్లర్ల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. పలుచోట్ల ఆందోళనకు దిగిన గుర్మీత్ బాబా అనుచరులు మీడియా వాహనాలు, ఫైరింజిన్లు, రైల్వే స్టేషన్లకు నిప్పుబెట్టారు. ఆదాయపన్ను కార్యాలయంపై కూడా దాడిచేసి విధ్వంసం సృష్టించారు
ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య ఘర్షణ చెలరేగి లాఠీఛార్జికి దారితీసింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. వాటర్ కేన్లు, బాష్పవాయువును ప్రయోగించారు. పంజాబ్లో రైల్వేస్టేషన్లు, పెట్రోల్ బంకులకు ఆందోళనకారులు నిప్పు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఆందోళనకారుల నిరసనల సెగలు ఢిల్లీకి తాకాయి. ఘజియాబాద్లో పలు వాహనాలకు నిప్పుపెట్టారు.
పంజాబ్లో సైతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వేస్టేషన్, పెట్రోల్ బంకుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బర్నాలా జిల్లా చనన్వాల్లో టెలిఫోన్ కార్యాలయాన్ని తగలబెట్టారు. ఆందోళనల నేపథ్యంలో బటిండా, మన్సా, ఫిరోజ్పూర్లో కర్ఫ్యూ విధించారు. ప్రజలు సంయమనం పాటించాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పంజాబ్లో 75 కంపెనీల కేంద్ర బలగాలు, హరియాణాలో 35 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. పంజాబ్, హరియాణాలోని అనేక ప్రాంతాల్లో బస్సు సర్వీసులు రద్దు చేశారు. మొబైల్ ఇంటర్నెట్, డేటా సేవలను నిలిపివేశారు.