కరోనా వైరస్ లాంటి వ్యాధులను తట్టుకోవాలంటే మానవులకు రోగనిరోధక శక్తి ఉండాలని అందుకోసం సి విటమిన్ ఉండే బత్తాయి లాంటి పండ్లు ఎక్కువగా తినాలి అని ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సూచన మేరకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా “తెలంగాణ బత్తాయి డే”ను పురస్కరించుకొని పెద్ద ఎత్తున పేద ప్రజలకు బత్తాయి పండ్లను పంపిణీ చేయడం జరిగింది.
చిత్రపురి కాలనీ లోని సినీ కార్మికులకు మనం సైతం సంస్థ అధ్యక్షులు సినీ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో బత్తాయి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే గచ్చిబౌలి కార్పొరేటర్ సాయి బాబా ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు. నానక్ రామ్ గూడలోని సుమధుర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థలో పని చేస్తున్న కార్మికులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు వెన్నమనేని శ్రీనివాస రావు మాట్లాడుతూ.. కరోనా అలాంటి వైరస్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో రోగనిరోధక శక్తిని పెంచడం కోసం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ పిలుపు మేరకు ఈరోజు బత్తాయి పండ్లను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ మాట్లాడుతూ.. ఇగ్నైటెడ్ మైండ్ సంస్థ తో కలిసి బత్తాయి పండ్లను పంపిణీ చేయడం జరిగింది అని.. మాకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 100 టన్నుల బత్తాయి పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. దీనిని ఇలాగే కొనసాగించి ప్రజలందరికీ బత్తాయి పండ్లను అందజేసి బత్తాయి రైతులకు అండగా ఉండాలని సంతోష్ ఆలోచనను ముందుకు తీసుకు వెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వల్లభనేని హైమాంజలి అనిల్ కుమార్, కిషోర్ గౌడ్, ప్రసన్న, వినోద్ బాల, కృష్ణమోహన్ రెడ్డి, అనిత,సురేష్ తదితరులు పాల్గొన్నారు.