ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక కోలుకుంటోంది. యశోద ఆసుపత్రిలో కోలుకుంటున్న మధులికను అడిషనల్ సీపీ శికాగోయల్ పరామర్శించారు.బాధితురాలు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలిపిన ఆమె నిందితుడు భారత్ కు కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు.
బాధితురాలి కుటుంబ సభ్యులకు కంప్లైంట్ ఇవ్వమని చెప్పామని కానీ వాళ్లు ఇష్టపడలేదన్నారు.కేవలం కౌన్సెలింగ్ కోసమే వచ్చారు కాబట్టి కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపిన ఆమె నిందితుడి కస్టడీ కోసం పిటిషన్ వేస్తామని తెలిపారు.
48 గంటల వైద్యుల శ్రమ ఫలితానికి మధులిక ఆరోగ్యం మెరుగు పడిందని యశోద హాస్పిటల్ సీఓఓ విజయ్ కుమార్ తెలిపారు. సుమారు ఏడు గంటల పాటు ఐదుగురు సభ్యుల వైద్య బృందం నాలుగు సర్జరీలు చేశారని, సర్జరీల తర్వాత మధులిక పూర్తిగా కోలుకుందని చెప్పారు.
హైదరాబాద్ బర్కత్పుర ప్రాంతానికి చెందిన మధులిక (17)పై భరత్ అలియాస్ సోను (20) అనే యువకుడు బుధవారం (ఫిబ్రవరి 6) కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేశాడు. రెండు సంవత్సరాలుగా మధులికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు భరత్. వేధింపులు తీవ్రమవడంతో పోలీసులను ఆశ్రయించింది మధులిక. దీంతో భరత్కు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా మధులికపై కోపం పెంచుకున్న భారత్ కొబ్బరి బొండాల కత్తితో దాడికి పాల్పడ్డాడు.
దాడిలో మధులిక తీవ్రంగా గాయపడింది. తలపై బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే అపోలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.