ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో కేంద్రంతో రైతుల చర్చలు కొనసాగుతున్నాయి. కార్పొరేట్ వ్యవసాయ చట్టాలు తమకు ఇష్టం లేదని రైతులు తెల్చిచెప్పారు. నూతన వ్యవసాయ చట్టం వల్ల ప్రభుత్వానికి ప్రయోజనం తప్ప రైతులకు కాదు. తాము శాంతిపూర్వక వాతావరణంలో నిరసన తెలుపుతున్నామని కేంద్రానికి రైతు సంఘం నాయకులు తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం 5వ విడత చర్చలను జరుపుతోంది. శనివారం ప్రత్యేక బస్సుల్లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్కు చేరుకున్న రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు ఈ చర్చలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అగ్రి చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని దోబా కిసాన్ సంఘర్ష్ కమిటీకి చెందిన హర్సులిందర్ సింగ్ డిమాండ్ చేశారు. చట్టాలకు సవరణలను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని అన్నారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోకపోయినా, తమ డిమాండ్లకు అంగీకరించకపోయినా రైతు ఆందోళనను ఉధృతం చేస్తామని ఆజాద్ కిసాన్ సంఘర్ష్ కమిటీ పంజాబ్ రాష్ట్ర చీఫ్ హర్జిందర్ సింగ్ తాండా హెచ్చరించారు.