త్రిపుల్ తలాక్.. ముస్లిం సాంప్రదాయంలో ఉన్న ఈ విధానంపై రకరకాల ఊహాగానాలు మొదలవుతున్నాయి. త్రిపుల్ తలాక్ వల్ల నష్టపోయేది ముస్లిం మహిళలేనని, త్రిపుల్ తలాక్ను వ్యతిరేకిస్తూ.. ఇప్పటికే కొంతమంది ముస్లిం స్త్రీలు కోర్టును ఆశ్రయించారు. ముస్లింల సాంప్రదాయం ప్రకారం మూడుసార్లు తలాక్ అంటే మహిళకు విడాకులు ఇచ్చే ముస్లిం పర్సనల్ లా త్రిపుల్ తలాక్ విధానంపై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.
దీంతో త్రిపుల్ తలాక్ అమలుపై.. ముస్లింల పర్సనల్ లా పై కేంద్రంలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇటీవలే ట్రిపుల్ తలాక్పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు కూడా వెలువరించింది. ట్రిపుల్ తలాక్ ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే అని స్పష్టం చేసింది. రాజ్యాంగపరంగా ట్రిపుల్ తలాక్ ఆమోదయోగ్యం కాదని, దీన్ని ఎవరూ ఆచరించాల్సిన అవసరం లేదని తెలిపింది. రాజ్యాంగంలో ఉన్న హక్కులను హరించేలా పర్సనల్ లాబోర్డు ఏదీ ఉండకూడదని హైకోర్టు తెలిపింది.
ఇదిలా ఉంటే. తాజాగా ఇదే త్రిపుల్ తలాక్ పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని ద్రౌపది వస్త్రాపహరణంతో పోల్చారు యూపీ సీఎం. మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ పై రాసిన పుస్తకాన్ని ఈ రోజు ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ, ముస్లింలు ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఉమ్మడి పౌరస్మృతి విధానాన్ని అమలు చేయాలని అన్నారు.
అయితే ట్రిపుల్ తలాక్ విధానంపై కొంతమంది మౌనంగా ఉంటున్నారని, వారిని దోషులుగా పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. ఈ విధానాన్ని రద్దు చేస్తామని భావించే యూపీ ఎన్నికల్లో చాలా మంది ముస్లిం మహిళలు తమ పార్టీకి ఓటు వేశామని ఇప్పటికే చెప్పారని అన్నారు. కాగా ట్రిపుల్ తలాక్ విధానంపై ముస్లిం మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, వారికి న్యాయం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు యోగి ఆదిత్యనాథ్.