తెలంగాణపై కేంద్రం వివవక్ష ఆగలేదని తెలిపారు మంత్రి కేటీఆర్. సంప్రదాయ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఆ ప్రతిష్టాత్మక జాతీయ కేంద్రాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.
ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన కేటీఆర్… ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్లోని జామ్నగర్లో సంప్రదాయ వైద్య కేంద్రాన్ని ప్రారంభిచడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంపై ప్రధాని మోదీ వివక్ష ఓ ధారావాహికంలా సాగుతోందని, తెలంగాణకు నిరాటంకంగా అన్యాయం జరుగుతున్నట్లు ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మంజూరీ చేసిన జాతీయ ఇన్స్టిట్యూట్ల వివరాలను కూడా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూళ్లను ఇతర రాష్ట్రాలకు మంజూరీ చేశారని, కానీ తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు.