బీజేపీ సెకండ్ లిస్ట్.. రెడీ ?

31
- Advertisement -

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ 195 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్.. కొండ విశ్వేశ్వరయ్య, బూర నర్సయ్య గౌడ్, పి. భరత్ వంటి వారిని తొలి జాబితాలో పేర్లను ఫైనల్ చేసింది కాషాయ పార్టీ. ఈ రెండు రోజుల్లో తెలంగాణ నుంచి సెకండ్ లిస్ట్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెకండ్ లిస్ట్ లో డీకే అరుణ, జలగం వెంకట్రావు, రఘునందన్ రావు వంటి వారి పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు టాక్. మొత్తం మీద మూడు జాబితాల్లో 17 స్థానాలకు గాను అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు వినికిడి. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలతో పోల్చితే 2023 లో బీజేపీ కొంత మెరుగు పడిందనే చెప్పాలి.

ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను కనీసం 10 స్థానాల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది కాషాయ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఆ పార్టీకి కలిసొచ్చిందేమీ లేదు. అందుకే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దమైంది. ఇప్పటికే అడపా దడపా ప్రచార కార్యక్రమాలు చేస్తున్న కమలనాథులు సెకండ్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ప్రచారంలో మరింత వేగం పెంచనున్నట్లు తెలుస్తోంది. మరి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ ఎన్ని సీట్లు సొంతం చేసుకుంటుందో చూడాలి.

Also Read:భీమా..ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు: గోపీచంద్

- Advertisement -