బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7తో ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాటు కట్టుదిట్టం చేశామని బీహార్ సీఈసీ హెచ్ఆర్ శ్రీనివాస మీడియాకు తెలిపారు.
బీహార్ సీఈసీ హెచ్ఆర్ శ్రీనివాస మాట్లాడుతూ.. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాలను 38 నుంచి 55కు పెంచామని పేర్కొన్నారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 38 జిల్లాల వ్యాప్తంగా 55 కేంద్రాల్లో 414 హాల్స్ను కౌంటింగ్కు సిద్ధం చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 59 కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. స్ట్రాంగ్రూమ్ల వద్ద 19 కంపెనీల బలగాలు భద్రతలో ఉన్నాయి.
అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ సారి బీహార్ను ఏలేది ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమే అని తేల్చేశాయి. ఇక సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడమే మిగిలిందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే కొన్ని సార్లు ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా తప్పే అవకాశాలున్నాయి. నవంబర్ 10వ తేదీన ఓటరు తీర్పు వెలువడనుంది.