మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కే దామోదర్ రెడ్డి ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో దామోదర్ రెడ్డి టిఆర్ఎస్లో చేరనున్నారు. దామోదర్రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎడ్మ కృష్ణారెడ్డి, జాన్ అబ్రహం కూడా టిఆర్ఎస్లో చేరనున్నారు.
గతంలో జెడ్పీ చైర్మన్గా పనిచేసిన ఆయన నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్నారు. ఇటీవల బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్లో చేరడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాహుల్గాంధీని కలిసి ఆయన్ను చేర్చుకోవద్దంటూ ఫిర్యాదు కూడా చేశారు. తన అభ్యంతరాలను అధిష్టానానికి చెప్పినా.. పట్టించుకోలేదని.. తన మాటకు విలువలేకుండా పోయిందనే ఆవేదన చెందిన ఆయన హస్తం పార్టీని వీడి కారెక్కేందుకు సిద్దమయ్యారు.
దామోదర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరకుండా ఉండేందుకు ఎమ్మెల్యే డీకే అరుణ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉన్నారని తెలిపిన బలమైన నేత కాంగ్రెస్ను వీడటం బాధాకరమన్నారు. పనిలో పనిగా నాగంపై నిప్పులు చెరిగారు అరుణ. బలమైన నాయకుడు అంటే అర్థమేంటి. లావు, ఎత్తు ఉంటే బలమైనవాళ్లవుతారా. నాగం జనార్థన్ రెడ్డి టీడీపీలో బలమైన నేత కావచ్చేమో.. కాంగ్రెస్లో మాత్రం దామోదర్రెడ్డి బలమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు అరుణ.