2024 సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా నాలుగు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలో 5వ దశ ఎన్నికల జరగనుండగా తాజాగా ఇండియా కూటమి మేనిఫెస్టోలో కొత్త అంశాన్ని చేర్చింది. లక్నోలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కీలక హామీని ఇచ్చారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేదలకు ప్రతి నెలా 10 కిలోల ఉచిత బియ్యాన్ని ఇస్తామని ప్రకటించారు ఖర్గే. ఇది బీజేపీ ఇచ్చిన హామీ 5 కిలోల కంటే రెట్టింపు. ఆహారభద్రత చట్టాన్ని మేం తీసుకొచ్చాం, దాన్ని ఆపితే ఎవరైనా కోర్టుకు వెళ్లవచ్చు అని తెలిపారు. ఇటీవల రాయ్బరేలీలో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ..బీజేపీ ఇస్తున్న 5 కిలోల రేషన్ ఎవరి కడుపుని నింపదని చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సందర్భంగా ఉచిత రేషన్ కావాలా ఉద్యోగం కావాలా అంటే ఉద్యోగాన్నే అందరూ ఎంచుకుంటారని విమర్శించగా ఇప్పుడు అదే కూటమి 10 కిలోల ఉచిత రేషన్ ఇస్తామని ప్రకటించడం విశేషం. ఇక రాహుల్ గాంధీ సైతం పేదలకు ఉచితంగా ఆహారం ఇచ్చిందే యూపీఏ సర్కార్ అని అందుకే ఆహార భద్రతా చట్టం కూడా తీసుకొచ్చామని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే పేదలకు మరింత మెరుగ్గా రేషన్ పంపిణీ చేపడతామన్నారు.
అయితే ఖర్గే చేసిన ప్రకటనపై కాంగ్రెస్లోనే బిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం ఈ విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు.
Also Read:ఓడిపోయినా CSK అర్హత సాధిస్తుందా?