చంద్రబాబు- హరీష్‌ల వాగ్వాదం.. కేసీఆర్ జోక్యం

479
kcr nayudu
- Advertisement -

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన అపెక్స్ కమిటీ తొలి సమావేశంలో వాదనలు, ప్రతివాదనలు జరుగుతున్న దశలో స్నేహపూర్వకంగా మెదిలితే సమస్యలు పరిష్కారమవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీంతో తెలంగాణ మంత్రి హరీష్‌ రావు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు స్నేహపూర్వకంగా ఉందామంటూనే మరోపక్క తెలంగాణ ప్రాజెక్టులకు పుల్లలు పెడుతున్నారని, అడ్డు unnamedతగులుతున్నారని విమర్శించారు. పాలమూరు.. దిండి కట్టవద్దని అపెక్స్ కమిటీలో ఎలా వాదిస్తారని చంద్రబాబును నిలదీశారు. స్నేహ పూర్వకంగా మెదిలే వారు ఇలా చేస్తారా? అని ప్రశ్నించారు. తమ నల్గొండ జిల్లా ప్రజలను ఖాళీ చేయించి మరీ పులిచింతలలో నీళ్లు నింపుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించామని, పంటలు ఎండిపోతున్నాయంటే నాగార్జున సాగర్ నీళ్లు విడుదల చేశామని, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం తమకు ప్రతీ విషయంలో అడ్డుతగులుతోందన్నారు. కర్ణాటకను ఒప్పించి ఆర్టీఎస్ పనులు చేయించుకుంటుంటే కూడా అడ్డుకుంటున్నారని మండి పడ్డారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని తరలించుతున్నందున కృష్ణాలో తమకు 45 టి.ఎంసీల న్యాయమైన వాటా పెరగాల్సి ఉన్నా, ఈ విషయంలో కూడా వాదన చేస్తున్నారని విమర్శించారు. నందిగామ ప్రాంతంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నందున నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నీళ్లు అక్కడికి చేరేదాకా శ్రద్ద తీసుకోవాలని మంత్రి ఉమామహేశ్వర్ రావు కోరినప్పుడు కూడా హరీష్ రావు అదే విధంగా స్పందించారు. ఒక వైపు నాగార్జన సాగర్ నీరు విడుదల చేయాలంటారు, మరవైపు శ్రీశైలం నీటిని విడుదల చేయరు అని హరీష్ విమర్శించారు. వాగ్వివాదం పెరిగిపోతుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. రెండు రాష్ట్రాల రైతులు, ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని సూచించారు. ఆంధ్రప్రాంత రైతుల సాగునీటి, ప్రజల తాగునీటి అవసరాలను కూడా తాము దృష్టిలో పెట్టుకుంటామని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడేవిధంగా ప్రభుత్వాలు పనిచేయాలని సూచాంచారు. కేంద్ర మంత్రి ఉమాబారతి కూడా జోక్యం చేసుకుని కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. అప్పుడప్పుడూ కలిసి కూర్చుని చాయ్ తాగుతూ మాట్లాడుకోండని సూచించారు.

సంచలనం కలిగించిన మోడి ప్రసంగం వీడియో, మేనిఫెస్టోలు

పాలమూరు, డిండి ప్రాజెక్టులు పాత ప్రాజెక్టులే అని నిరూపించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అనేక ఆధారాలు సేకరించి సమావేశంలో ప్రస్తావించింది. 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడి మహబూబ్ నగర్ సభలో చంద్రబాబు సాక్షిగా చేసిన ప్రసంగాన్ని సభలో ప్రదర్శించారు. అందులో నరేంద్రమోడి మాట్లాడుతూ, మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీరు లేక రైతులు చనిపోతున్నారని చెప్పారు. సాగునీరు అందిస్తే జిల్లా రైతులు మట్టిలో బంగారం పండిస్తారని చెప్పారు. ఈ జిల్లా రైతుల కోసం పాలమూరు ఎత్తిపోతల పధకం కడతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనిచేయలేదని విమర్శించారు. తల్లి కొడుకులు (సోనియా, రాహుల్) నిద్రపోయారా? అని కూడా నరేంద్రమోడీ నిలదీశారు.

ఈ వీడియోను ఉమా భారతితో పాటు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు ఆసక్తిగా గమనించారు. ఇదే సందర్భంలో 2O14లో బిజెపి, కాంగ్రెస్, టిడిపి విడుదల చేసిన మానిఫెస్ట్రోలు కూడా చూపించారు. ఈ మూడు పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రణాళికలో పాలమూరు ఎత్తిపోతల పధకం పూర్తి చేస్తామనే హామీని అక్షరాలా రూపొందించాయి. చంద్రబాబు పోటోతో ఉన్న తెలంగాణ తెలుగుదేశం మానిఫెస్టోలో పాలమూరు ఎత్తిపోతల పధకం పూర్తి చేస్తామని ప్రకటించిన విషయాన్నీ, బిజెపి కూడా పాలమూరును పూర్తి చేస్తామని చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహా మరెవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. ఈ రెండు ప్రాజెక్టులు కొత్తవనే వాదనలో వాస్తవం లేనందున ఆంధ్రప్రదేశ్ వాదన నిరాధారమైందని తేలిపోయిందని, కాబట్టి ఆ రాష్ట్ర వాదనను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి చెప్పారు. ఆ తర్వాత పాలమూరు, డిండి పాత ప్రాజెక్టులా? కొత్త ప్రాజెక్టులా? అనే విషయంలో చర్చ ముగిసింది.

మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని బీడు భూములకు సాగునీరు అందించడానికి ఉద్దేశించిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పధకాలను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఆ రెండు పాత ప్రాజెక్టులే కాబట్టి కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎన్ని నీళ్లు కేటాయిస్తే, వాటిలో నుంచే ఈ రెండు ప్రాజెక్టులను నీటిని తీసుకుంటామని ముఖ్యమంత్రి కేంద్రానికి, ఆంధ్రప్రభుత్వానికి హామీ ఇచ్చారు.

కేంద్ర  మంత్రి ఉమా భారతి అధ్యక్షతన అపెక్స్ కమిటీ తొలి సమావేశం బుధవారం డిల్లీలోని శ్రమశక్తి భవన్ లో రెండు గంటలపాటు సాగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. పాలమూరు, డిండి ఎత్తిపోతల పధకాలను కట్టవద్దని, కేంద్రం జోక్యం చేసుకుని ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీటి పారుదల శాఖ మంత్రి ఉమా మహేశ్వర్ రావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ వాదనలు వినిపించారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ లో పాలమూరు, డిండి ఎత్తిపోతల పధకాలు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా పేర్కొనలేదు కాబట్టి, అవి కొత్త ప్రాజెక్టులేనని ఆంధ్రప్రదేశ్ వాదించింది. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కడితే తమకు నీటి లభ్యత తగ్గిపోతుందని, కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు కట్టవద్దని ఎపి ప్రభుత్వం డిమాండ్ చేసింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి తెలంగాణ తరపు వాదన ప్రారంభించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమర్థవంతంగా వాదనలు వినిపించారు.

పాలమూరు, డిండి పాత ప్రాజెక్టులపై సాక్ష్వాధారాలు
పాలమూరు, డిండి పాత ప్రాజెక్టులేనని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. డిండి ప్రాజెక్టు నిర్మాణం కోసం 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 159ని, పాలమూరు ఎత్తిపోతల పధకం కోసం 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 72ను తెలంగాణ అధికారులు ఉమా భారతితో సహా సమావేశంలో పాల్గొన్న అందరికీ అందచేశారు. ఇవి రెండు పాత ప్రాజెక్టులే అని చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏమి కావాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. దీంతో ఆంద్ర అధికారులు విభజన చట్టాన్ని ప్రస్తావించారు. చట్టంలోని 11వ షెడ్యూల్లో ఆరు ప్రాజెక్టులను మాత్రమే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా పేర్కొన్నారని, వాటిలో పాలమూరు, డిండి లేదు కాబట్టి వాటిని పాత ప్రాజెక్టులుగా పరిగణించలేమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుంటూ విభజన చట్టం రూపొందించే సందర్భంగా ఆన్ గోయింగ్‌ ప్రాజెక్టుల వివరాలను అసమగ్రంగా రూపొందించారని చెప్పారు. కేవలం ఆరు ప్రాజెక్టులు మాత్రమే చూపించారని, కానీ ఆంధ్ర, తెలంగాణలో దాదాపు 25 ప్రాజెక్టులు కడుతున్నారని చెప్పారు. వాటిలో కృష్ణా బేసిన్లో ఎఎంఆర్పి, ఎస్ఆర్బిసి, ముచ్చిమర్రి, గోదావరి బేసిన్లో దేవాదుల, ప్రాణహిత, రాజీవ్ దుమ్ముగూడెం, ఎల్లంపల్లి, వరద కాలువ, పోలవరం తదితర ప్రాజెక్టులను కూడా 11వ షెడ్యూల్ లో పేర్కొనలేదని, మరి అవి కూడా కొత్త ప్రాజెక్టుల కిందనే జమ కడతారా? అని ప్రశ్నించారు. దీంతో 11వ షెడ్యూల్ లో పేర్కొన్న వాటినే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా పరిగణించలేమని చంద్రబాబు కూడా ప్రకటించారు.

సాగునీరు లేని తొమ్మిది జిల్లాల్లో తెలంగాణలో మూడు
దేశ వ్యాప్తంగా సాగునీటి సౌకర్యం సరిగా లేని తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్లోండ, రంగారెడి జిల్లాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం తన ప్రజంటేషన్‌లో పేర్కొన్నది. ఈ మూడు జిల్లాలకు నీరందించడానికే తాము పాలమూరు, డిండి ప్రాజెక్టులు కడుతున్నామని స్పష్టం చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సబబు కాదని విన్నవించింది.

ట్రిబ్యునల్ తీర్పు త్వరగా కావాలి
పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవా? పాతవా? అనే చర్చే అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తమకున్న నీటి వాటాను ఎక్కడి నుంచైనా, ఏ ప్రాజెక్టుల ద్వారా అయినా వాడుకునే హక్కు రాష్ట్రాలకు ఉంటుందని, దాని ప్రకారమే తెలంగాణ రాష్ట్రం నీరు వాడుకుంటుందని తేల్చి చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులను ఎట్టి పరిస్తితుల్లో కట్టి తీరుతామని సిఎం తేల్చి చెప్పారు. కృష్ణ నదిలో ఎవరెన్ని నీళ్లు వాడుకోవాలనే విషయంలో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడాల్సి ఉందని, ట్రిబ్యునల్ కేటాయించిన నీటి వాటా ప్రకారమే తాము నీటిని వాడుకుంటామని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని సిఎం కేసీఆర్ కోరారు. చంద్రబాబు కూడా ఈ డిమాండ్ కు మద్దతు పలికారు. దీంతో కేంద్ర మంత్రి ఉమా భారతి ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వెలువరించాలని కోరతామని చెప్పారు.

రెండేళ్ల నాలుగు నెలల సమయం వృధా చేశారు
తెలంగాణ ఏర్పడి రెండేళ్ల నాలుగు నెలలు పూర్తయ్యాయని, ఇప్పటి వరకు తమ రాష్ట్రానికి నీటి కేటాయింపులు జరగలేదని సిఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత సమయం వృధా అయిందని, నీటి వాటా తేలకుండా ప్రాజెక్టుల విషయంలో ఎవరికీ స్పష్టత రాదని సిఎం అన్నారు. నీటి వాటాల విషయంలో సెక్షన్ 3 కింద రిట్ పిటిషన్ వేశామని, సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నదని, ఎక్కడా ఇంకా స్పష్టత రావడం లేదని చెప్పారు. అసలు కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా సిడబ్ల్యుసి అనుమతి లేదని సిఎం అన్నారు. దీనికి ఆంధ్ర అధికారులు కూడా మద్దతు పలికారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు తమ ప్రణాళికలు తాము రూపొందించుకుని ముందకు పోతాయని, లెక్కలు తేలకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు.

శ్రీశైలం దగ్గర కావాల్సినంత నీరు
పాలమూరు ఎత్తిపోతల పధకానికి శ్రీశైలం సోర్సుగా పెట్టుకోవడాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుపట్టింది. శ్రీశైలంలో కావాల్సినంత నీరు లేదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వాదించారు. దీనికి కేసీఆర్ సమాధానమిస్తూ ఏదో ఒకసారి తప్ప మెజారిటీ సందర్భాల్లో శ్రీశైలం వద్ద కావాల్సినంత నీటి లభ్యత ఉందన్నారు. గత 48 సంవత్సరాల్లో శ్రీశైలం డ్యామ్ వద్ద ఏ ఏడు ఎన్ని టిఎంసిల నీటి లభ్యత ఉందో చెప్పే సిడబ్ల్యుసి వెల్లడించిన గణాంకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి ఉమాభారతికి అందించారు. 48 సంవత్పారాల్లో మెజారిటీ సందర్భాల్లో వెయ్యి టిసిఎంలకు పైగా నీటి లభ్యత ఉందని, సగటు ఏడాది నీటి లభ్యత 1204 టిసింసీలు ఉంటుందని ముఖ్యమంత్రి సిడబ్ల్యుసి లెక్కలను అందించారు. గోదావరిలో సగటున మూడు వేల టిఎంసిలు, కృష్ణలో సగటున వెయ్యి టిఎంసిలు అందుబాటులో ఉంటాయని, నాలుగువేల టిఎంసిలను తెలివిగా వాడుకుంటే రెండు రాష్ట్రాల రైతులు బాగుపడతారని సిఎం కేసీఆర్ ప్రతిపాదించారు.

ఉందని, ట్రిబ్యునల్ కేటాయించిన నీటి వాటా ప్రకారమే తాము నీటిని వాడుకుంటామని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని సిఎం కేసీఆర్ కోరారు. చంద్రబాబు కూడా ఈ డిమాండ్ కు మద్దతు పలికారు. దీంతో కేంద్ర మంత్రి ఉమా భారతి ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వెలువరించాలని కోరతామని చెప్పారు.

మాది ఇచ్చిపుచ్చుకునే ధోరణి

Displaying IPR_2259.jpg
తెలంగాణ రాష్ట్రానిది ఇచ్చిపుచ్చుకునే దోరణి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ అదికారులు కూడా తమ వాదనలు వినిపించే క్రమంలో సాగునీటి విషయంలో మహారాష్ట్రతో, కర్ణాటకతో మంచి సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా అలాంటి సంబంధాలే కోరుకుంటున్నామని, వివాదాలు కోరుకోవడం లేదని చెప్పారు. అపెక్స్ కొన్సిల్ సమావేశం పట్ల సిఎం సంతృప్తి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వాదనలను సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగామని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు పరస్పరం అభినందనలు తెలుపుకున్నరు. సమావేశంలో పాలమూరు, డిండి పాత ప్రాజెక్టులే అనే విషయాన్ని నిర్ధారించగలిగామని, కేంద్రం కూడా తెలంగాణ చెప్పిందే నిజమని నమ్మిందని సిఎం అన్నారు. ఇక పాలమూరు, డిండి పాత ప్రాజెక్టులా? కొత్త ప్రాజెక్టులా? అనే చర్చ ముగిసినట్లేనని సిఎం అభిప్రాయపడ్డారు. ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చే విషయంలో కేంద్రం చొరవ తీసుకునేలా వత్తిడి తేగలిగామని సిఎం అన్నారు. కేంద్ర మంత్రి ఉమా భారతి కూడా సహనంతో సమావేశం నిర్వహించారని సిఎం అన్నారు. సమావేశంలో తెలంగాణ తరుపున సమర్థ వాదనలు రూపొందించి, వినిపించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్. కె. జోషిని, ఇన్ ఎన్ సి విజయ్ ప్రకాశ్ ను, ఇతర అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.

సమావేశం అనంతరం డిల్లీలోని తన నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రిని పలువురు ఎంపిలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపిలు స్వీట్లు పంచుకుని ఆనందం పంచుకున్నారు.

ఆరు అంశాలో కుదిరిన అంగీకారం
డిల్లీలో జరిగిన అపెక్స్ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆరు అంశాల్లో పరస్పర అంగీకారం కుదిరింది. ఇద్దరు ముఖ్యమంత్రుల అబిప్రాయాలకు అనుగుణంగా కేంద్ర మంత్రి ఉమా భారతి వాటిని సమావేశంలో నిర్ధారించారు.
1. రెండు రాష్ట్రాల్లో అన్ని ప్రాజెక్టుల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు ఉమ్మడి కమిటీ పేయాలి. తెలంగాణలోని ప్రాజెక్టులను ఆంద్ర అధికారులు, ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టులను తెలంగాణ అదికారులు సందర్శించవచ్చు. పరిశీలించవచ్చు.

2. ఏ ప్రాజెక్టులోకి ఎంత ఇన్ ఫ్లో ఉంది, ఎంత ఔట్ ప్లో ఉంది అనే విషయాలను శాస్త్రీయంగా నిర్ధారించడానికి టెలిమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయాలి. రెండు మూడు నెలల్లోనే ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇందుకు అయ్యే వ్యయం రెండు రాష్ట్రాలు భరించాలి.

3. కృష్ణా జలాల కేటాయింపుకు సంబంధించి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వీలైనంత త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎవరెన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా, కమిటీ ఇచ్చిన తుది తీర్పును అవనుసరించి, కేటాయించిన నీటి వాటాకు అనుగుణంగానే నీటి వాడకం జరగాలి.

4. కృష్ణా జలాల వినియోగంపై వేసిన ఐదుగురు సభ్యుల కమిటీలోని చైర్మన్ తో పాటు మరో సభ్యుడి నిస్పాక్షికతపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపధ్యంలో కమిటినీ పునర్వ్యవస్థీకరించాలి. దీనిపై కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని రెండు రాష్ట్రాలు గౌరవించాలి.

5. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించినందున నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతానికి 45టిఎంసిల అదనపు నీటిని కేటాయించే విషయంలో గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వ్యవహరించాలి. ఏ నిష్పత్తిలో పంచాలో కమిటీ నిర్ణయిస్తుంది.

6. విభజన బిల్లులోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టుల వివరాల్లో ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల విషయంలో అసమగ్రత ఉన్న దృష్ట్యా దానిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

- Advertisement -