నామినేషన్ గడువు సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్లో అసమ్మతి నేతలు,రెబల్ అభ్యర్థుల బెడద తలనొప్పిగా మారుతోంది.ఇప్పటికే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి సహా సీనియర్ నేతలు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. పలువురు మాజీ మంత్రులు రెబల్గా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి బ్యాచ్ హస్తం పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటివరకు ప్రకటించిన రెండు జాబితాల్లో రేవంత్ బ్యాచ్కు తీవ్ర నిరాశే ఎదురైంది. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రేవంత్ వర్గం నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు బంజారాహిల్స్లో మాజీ మంత్రి బోడ జనార్దన్ నేతృత్వంలో బంజారాహిల్స్లోని ఓ హోటల్లో సమావేశమైన రేవంత్ బ్యాచ్ నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
తమను కాకుండా పార్టీలో చేరి ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిర్పూర్, చెన్నూరు, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో కొత్తగా కాంగ్రెస్లో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం బాధాకరమని బోడ జనార్దన్ అన్నారు. కాంగ్రెస్లో సీట్లు సీట్లు అమ్ముకున్నారని మండిపడుతున్నారు. మరోవైపు కోదాడ నుండి టీడీపీ టికెట్ ఆశీంచిన బొల్లం మల్లయ్య యాదవ్ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్లో సీట్ల కేటాయింపు హస్తిన నేతలకు తలకు మించిన భారంలా మారింది.