సోషల్ మీడియాలోకి ‘జనసేన’

258
- Advertisement -

ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌…మరోవైపు పార్టీని బలోపేతం చేయటంపై దృష్టిసారించారు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో…దీని ద్వారా ప్రజలకు ముఖ్యంగా యువకులకు చేరువయ్యేందుకు ప్రణాళికలు రచించారు. ఇందుకోసం జనసేన పేరుతో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఖాతా తెరిచింది. అలాగే యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది.

pawan

పార్టీకి సంబంధించిన సమాచారం, పార్టీ సిద్ధాంతాలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సమావేశాలకు సంబంధించిన వీడియో పుటేజ్ ను యూట్యూబ్ ద్వారా కార్యకర్తలను అందజేస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

నిజానికి గ‌త సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘జ‌న‌సేన’ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఈ పార్టీ చేపట్టే కార్యక్రమాలు చాలా తక్కువే అయినప్పటికీ… వాటికి లభించే ప్రచారం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఏపీకి ప్రత్యేక హోదాపై తిరుపతి, తూర్పుగోదావరి జిల్లాలలో బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. పార్టీగా రూపాంతరం చెందిన జనసేనకు ఇంతవరకూ ఎటువంటి నిర్మాణాత్మక కమిటీలు ఏర్పాటు చేయలేదు. పార్టీకి సంబంధించి ఇంతవరకూ కర్త ,కర్మ,క్రియ అన్నీ పవన్ కళ్యాణ్ నే నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ప్రజలకు చేరువయ్యేందుకు జనసేన పార్టీ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

pawan_kalyan

ప‌వ‌న్ క‌ల్యాణ్ తాను కొత్త‌గా ర‌చిస్తోన్న ‘నేను-మనం-జనం’ పుస్త‌కం ద్వారా పార్టీ సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల ముందుకు తీసుకువ‌స్తాన‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా మరింత ప్రజల్లోకి వెళ్లాలని జనసేన యోచిస్తోంది.

- Advertisement -