తెలంగాణ అంటేనే బీజేపికి కడుపు నిండా విషం- మంత్రి హరీష్‌

37
- Advertisement -

తెలంగాణపై విషం కక్కిన మోడీ ఇప్పుడు వలస జీవులపై విషం కక్కాడు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. ఆయన ఈరోజు హన్మకొండలో పర్యటించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో ఎంతో మంది వలస జీవులు బతికి ఉంటే చాలు అనుకుంటే, మోడీ వారిపై కూడా ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు. వలస కార్మికులకు సమయం ఇవ్వలేదు. అకస్మాత్తుగా లాక్ డౌన్ పెట్టారు. ఎంతో మంది నరకం చూసారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భోజనం పెట్టి, జేబులో డబ్బులు పెట్టి, రైళ్లు ఏర్పాటు చేసి ఇళ్లకు పంపారు. ఇలా వలస కార్మికులకు అనేక మంది, సేవా సంస్థలు సహకారం అందించాయి. వారందరినీ అభినందిచల్సినది పోయి, మోడీ విమర్శలు చేస్తున్నారు. వారిని ఇంటికి పంపడం వల్లనే కరోనా పెరిగింది అని అవమాన పరిచారు. వలస జీవులపై ఎందుకు మోడీకి ఈ చిన్నచూపు? అని మంత్రి ప్రశ్నించారు. వలస కార్మికుల కష్టాలు అర్థం చేసుకోవడంలో కేంద్రం ఫెయిల్ అయ్యింది. మీరు ట్రంపును తీసుకు వచ్చి, మీటింగ్ లు పెడితే, ఎన్నికల ర్యాలీలు పెడితే కరోనా పెరగలేదు కానీ, వలస కార్మికుల వల్ల పెరిగిందా..? మండిపడ్డారు.

ఇంత కంటే దారుణం ఇంకొకటి ఉంటదా.?! పొట్ట చేత పట్టుకొని ఉన్న వారిపై నిందలు వేయడం కంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదు. మొన్న తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారు. తెలంగాణ ఉద్యమ కారుల బలిదానాలను కించపరిచారు. తెలంగాణ ఏర్పాటును తక్కువ చేయడం అంటే.. అమరులకు కించపరచడం. ఉద్యమాన్ని కించ పరచడమే. వరంగల్ లోనే ఎంత మంది బలిదానాలు చూసాము. ఎన్ని త్యాగాలు, ఎన్ని శవాలు మోసాము. అప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నరు. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరగలేదు అంటున్నారు. తెలంగాణపై ఎప్పుడు విషం చిమ్మడమే మోడీ పని. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు. 157 మెడికల్ కాలేజీ ఇస్తే ఎందుకు ఒక్కటి ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు, ఐఐఎం, ఐఐఐటీ, ఒక్కటి ఇవ్వలేదు. అన్నింటా తెలంగాణకు మొండి చేయి చూపారు.

మాటలతో హింస. తెలంగాణ ప్రజలను అవమానించేలా చర్యలు. అందరూ వ్యతిరేకిస్తున్న కూడా వ్యవసాయ చట్టాలు ఎలా చేశారు. తెలంగాణ అంటేనే బీజేపికి కడుపు నిండా విషం. మీకు తెలంగాణలో నూకలు చెల్లినై. నిధులు ఇవ్వరు. సూటి పోటి మాటలు. అమరుల త్యాగాలను తక్కువ చేస్తరు. మీరు ఎన్ని చేసినా రాష్ట్రం పురోగతిలో ఉంటది. అభివృద్ధి ఆగదు అన్నారు. ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధిలో టాప్ 10లో దేశంలో 7 తెలంగాణవి ఉన్నాయి. వివిధ రంగాల్లో కేంద్రం నుండి అనేక అవార్డులు ఇచ్చారు. ఇది మా పని తీరు కండ్లు కనిపిస్తలేవ..?! మోడీ గారు ఇంకో మాట అంటారు. రాష్ట్రాలు, కేంద్రం కలిసి ఉండాలని నీతులు బాగా చెబుతాడు. మరి ఎందుకు మా ఏడు మండలాలు ఆదరా.. బాదరాగా ఆంధ్రలో కలిపారు, ఎందుకు సీలేరు ప్రాజెక్టు అప్పగించారు. నువు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పు. తెలంగాణపై మోడీ చేసిన వ్యాఖ్యలు, వాళ్ళ తీరు పట్ల జర్నలిస్టు సంఘాలు కూడా కదలాలి. ఉద్యమంలో వరంగల్ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారు అని మంత్రి గుర్తు చేశారు.

- Advertisement -