ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పంచాయతీరాజ్ శాఖలోని పలు అంశాలపై హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి రానున్న మూడు రోజుల్లోగా కొత్త రోడ్లకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.
పంచాయతీరాజ్ శాఖలో ఇప్పటికే పదోన్నతులు పొందిన 57 మంది డీపీఓలు, ఎంపీడీఓలకు పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించాలని, దీనికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలన్నారు. కారోబార్లు, పంప్ మెకానిక్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు.