మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత విభేదాలు మరింత పెరుగుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. శుక్రవారం కోల్కతాలోని కాళీఘాట్ నివాసంలో మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి కేవలం 8 మంది ఎమ్మెల్యేలు, 6 మంది ఎంపీలు మాత్రమే హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
టీఎంసీకి ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభల్లో కలిపి 42 మంది ఎంపీలు (29 మంది లోక్సభ, 13 మంది రాజ్యసభ) ఉన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, సమావేశానికి కేవలం 14 మంది మాత్రమే హాజరయ్యారు.
సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలలో బీనా మండల్, అశిమా పాత్ర, మదన్ మిత్రా, కునాల్ ఘోష్, ఫిర్హాద్ హకీమ్, శోభందేబ్ ఛటర్జీ, బిమన్ బెనర్జీ, అశోక్ కుమార్ దేబ్ ఉన్నారు. ఎంపీలలో డోలా సేన్, మాలా రాయ్, కల్యాణ్ బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఓ’బ్రియెన్, సుదీప్ బంద్యోపాధ్యాయ్ పాల్గొన్నారు.
అయితే ఈ సమావేశం అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం నిర్వహించలేదని టీఎంసీ స్పష్టం చేసింది. ఇది పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశమని, జాతీయ కార్యవర్గ సభ్యులైన మహువా మొయిత్రా, సుష్మితా దేవ్, ముకుల్ సంగ్మా తదితరులు వర్చువల్గా పాల్గొన్నారని పార్టీ వివరణ ఇచ్చింది.
మమతా బెనర్జీ లోక్సభకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె భవానీపూర్ స్థానం నుంచి ఓడిపోయిన తర్వాత రాజకీయంగా కొత్త వ్యూహాలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read:లోక్సభకు మమతా బెనర్జీ!
అందులో భాగంగా బహరంపూర్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న యూసుఫ్ పఠాన్ తన స్థానాన్ని ఖాళీ చేయవచ్చని, ఆ స్థానంలో మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మమతా లోక్సభలోకి ప్రవేశిస్తే, పార్టీలో పెరుగుతున్న తిరుగుబాటును అణచివేయడానికి అది కీలక రాజకీయ అడుగుగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

