తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజామున 2 గంటల నుండి 4.30 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపడతారు. సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగనున్నాయి.
ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఫిబ్రవరి 27వ తేదీ గురువారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహిస్తారు.
Also Read:ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు?: కేటీఆర్
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో భక్తిసంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన గురువారం సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు శివపార్వతుల కల్యాణమహోత్సవం వైభవంగా జరుగనుంది.