కోల్కతా పాఠశాలల మధ్యాహ్న భోజన తయారీలో ‘ఇస్కాన్’ సంస్థను భాగస్వామ్యం చేయాలని పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల మెనూ నుండి గుడ్లు తొలగిపోయే అవకాశం ఉంది. గతంలో కొన్ని ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా మధ్యాహ్న భోజనం నుండి గుడ్లను తొలగించాయి.
సండే హో యా మండే, రోజ్ ఖావో అండే (ఆదివారమైనా, సోమవారమైనా రోజుకో గుడ్డు తినండి) — నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) ప్రచారంలో భాగంగా వచ్చిన ఈ ప్రసిద్ధ నినాదం భారతదేశంలో ఎంతో గుర్తింపు పొందింది. దీని సందేశం చాలా స్పష్టం…లభించే ఆహారాల్లో గుడ్డు అత్యంత చౌకైనది మరియు అత్యధిక పోషకాలు కలిగినది. విటమిన్-సి మినహా, శరీరానికి అవసరమైన దాదాపు అన్ని ముఖ్యమైన విటమిన్లు, అధిక నాణ్యత గల ప్రొటీన్లు ఇందులో ఉంటాయి. అందుకే గుడ్డును ‘సూపర్ ఫుడ్’ అని పిలుస్తారు. దీనిని నిరూపించడానికి అనేక శాస్త్రీయ అధ్యయనాలు కూడా ఉన్నాయి.
పిల్లల్లో పోషకాహార లోపాన్ని అరికట్టడంలో గుడ్డుకున్న ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం.. అనేక రాష్ట్రాల్లో పాఠశాల మధ్యాహ్న భోజన పథకంలో దీనిని చేర్చింది. కానీ నేడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో గుడ్లను అందించడం లేదు. లభిస్తున్న గణాంకాల ప్రకారం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు గుడ్లను అందించడం లేదు.
ఈ జాబితాలో తాజాగా చేరిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కోల్కతా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బాధ్యతలను ‘ఇస్కాన్’ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్) కు అప్పగించింది. దీనివల్ల మధ్యాహ్న భోజనంలో ఇకపై గుడ్లు వడ్డించకపోవచ్చని నివేదికలు తెలుపుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి స్వపన్ దాస్గుప్తా సోమవారం (జూన్ 22) బీజేపీ ప్రభుత్వ తొలి బడ్జెట్ను ప్రవేశపెడుతూ.. కోల్కతాలో మధ్యాహ్న భోజన పథకం కింద ఆహార తయారీ మరియు పంపిణీలో ఇస్కాన్ సహకారం ఆశిస్తున్నట్లు తెలిపారు.మెనూ నుండి గుడ్లను తొలగించే అవకాశం ఉండటంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ రచ్చ మొదలైంది. రాజకీయ ప్రత్యర్థులపై గుడ్లు విసరండి. కానీ మధ్యాహ్న భోజనంలో గుడ్లను తీసేసి పిల్లలకు పోషకాహారాన్ని దూరం చేయకండి. శాకాహారాన్ని బలవంతంగా రుద్దడాన్ని బెంగాల్ తిరస్కరిస్తుంది,” అని ఆయన జోడించారు.
ప్రభుత్వ మధ్యాహ్న భోజన కార్యక్రమం కింద అదనపు పోషకాహారంగా గుడ్లను అందించిన 15 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో (UTs) పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. ప్రస్తుతం దేశంలోని 28 రాష్ట్రాలు..ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో కేవలం 14 రాష్ట్రాలలో మాత్రమే మధ్యాహ్న భోజనంలో గుడ్లు అందిస్తున్నారు. గుడ్లను మినహాయించిన రాష్ట్రాలను పరిశీలిస్తే అందులో బీజేపీ పాలిత ప్రభుత్వాల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది.
Also Read:సీషెల్స్లో ప్రధాని మోదీ పర్యటన
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అస్సాం, ఒడిశా, ఉత్తరాఖండ్, బీహార్ మరియు మహారాష్ట్ర ఐదు రాష్ట్రాల్లో మాత్రమే గుడ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. (ప్రస్తుతం బీజేపీకి 17 మంది ముఖ్యమంత్రులు ఉండగా, దాని కూటమి భాగస్వాములకు చెందిన 5 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు). ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఛత్తీస్గఢ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, ఢిల్లీ మరియు త్రిపుర రాష్ట్రాలలో గుడ్లను అందించడం లేదు.దీనికి భిన్నంగా బీజేపీయేతర రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం మరియు పలు కేంద్రపాలిత ప్రాంతాలు పాఠశాల పోషకాహార కార్యక్రమాల ద్వారా గుడ్లను అందించడం కొనసాగిస్తున్నాయి.
ఏదేమైనప్పటికీ భోజనంలో ఏయే పదార్థాలు వడ్డించాలనే నిర్ణయం పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానుసారమే జరుగుతుంది. ఫలితంగా పిల్లలకు గుడ్లు లభించడం అనేది పోషకాహార శాస్త్రంపై కాకుండా వారు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు. అక్కడ ఎవరు పాలిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

