నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) జూన్ 25న విడుదల చేసిన తన 9వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యపుస్తకం నుండి రాజ్యాంగ పీఠిక తో పాటు ‘లౌకిక’ మరియు ‘లౌకికవాదం’ అనే పదాల ప్రస్తావనలను తొలగించింది. అదే సమయంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి కి సంబంధించిన అంశాలను కొత్తగా చేర్చింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.
ఈ నేపథ్యంలో స్పందించారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. 9వ తరగతి పాఠ్యపుస్తకాల్లో ఎమర్జెన్సీ విభాగాన్ని చేర్చాలన్న NCERT నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. ఆ కాలంలోని చీకటి అధ్యాయాన్ని భవిష్యత్ తరాలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని, తద్వారా ఇటువంటి పరిస్థితులు మళ్లీ ఎప్పటికీ రాకుండా చూసుకోవచ్చని ఆయన అన్నారు.
ప్రధాన్ మాట్లాడుతూ….ఇది సరైనదే. NCERT సరైన పని చేసింది. ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను భవిష్యత్ తరాలు తెలుసుకోవాలి మరియు అర్థం చేసుకోవాలి.. తద్వారా అలాంటి పరిస్థితి మళ్లీ రాదు. అందుకే NCERT దీనిని తెరపైకి తెచ్చింది. NCERT మంచి పని చేసింది అని పేర్కొన్నారు.
గతంలో విద్యార్థులకు రాజ్యాంగ విలువలను పరిచయం చేయడానికి ఆ అధ్యాయంలో పీఠికను ఒక ప్రధాన మార్గదర్శిగా ఉపయోగించేవారు. రాజ్యాంగం అంతా తత్వశాస్త్రం పై ఆధారపడి నిర్మించబడిందో ఆ తత్వశాస్త్రాన్ని పీఠిక కలిగి ఉంటుందని అందులో పేర్కొనేవారు. అంతేకాకుండా విద్యార్థులకు సార్వభౌమ , సామ్యవాద , లౌకిక , ప్రజాస్వామ్య మరియు గణతంత్ర అనే పదాల అర్థాలను బోధించేవారు.
ALso Read:సీషెల్స్లో ప్రధాని మోదీ పర్యటన
రాజ్యాంగ పీఠిక ప్రజాస్వామ్యంపై రాసిన కవితలా ఉంటుంది అని ఆ అధ్యాయంలో పేర్కొంటూ.. లౌకికవాదం అంటే దేశానికి ఎటువంటి అధికారిక మతం ఉండదని, రాజ్యం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని వివరించేవారు. కానీ కొత్త పాఠ్యపుస్తకంలో రాజ్యాంగాన్ని కేవలం రాజ్యాంగ పరిషత్ , రాజ్యాంగ రూపకల్పన, ప్రజాస్వామ్య సంస్థలు మరియు ప్రాథమిక హక్కుల విభాగాల ద్వారా మాత్రమే చర్చించారు. స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించడానికి 1946 లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడిందని పేర్కొంటూ.. భారత రాజ్యాంగాన్ని ఒక బలమైన, అనుకూలమైన, పరివర్తనాత్మకమైన మరియు స్పందించే పత్రంగా అభివర్ణించారు. ఇది స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం మరియు సౌభ్రాతృత్వాన్ని నొక్కి చెబుతుంది. అలాగే సమానత్వం, స్వేచ్ఛ మరియు మతానికి సంబంధించిన హక్కుల గురించి చర్చిస్తుంది.

