జస్టిస్ స్వర్ణ కాంత శర్మను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అవమానకర మరియు దూషణలతో కూడిన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ మరియు ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకులకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం (మే 19) నోటీసులు జారీ చేసింది. దీనిపై సమాధానం ఇవ్వడానికి కోర్టు వారికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.
ఢిల్లీ మద్యం విధానం కేసుకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేస్తూ.. ఈ కోర్టుకు చెందిన సింగిల్ జడ్జి మే 14న ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఈ కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభమయ్యాయని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ రవీందర్ దుడేజాలతో కూడిన డివిజన్ బెంచ్, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నాయకులందరికీ తమ సమాధానాలు దాఖలు చేయడానికి నాలుగు వారాల సమయం మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 4, 2026కు షెడ్యూల్ చేసింది.
న్యాయమూర్తి మరియు న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ప్రచారాలు, బహిరంగ ప్రకటనలు, ఎడిట్ చేసిన వీడియోలు మరియు ఆన్లైన్ కంటెంట్ను పోస్ట్ చేసినందుకు గాను.. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, వినయ్ మిశ్రా మరియు ఇతరులపై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మే 14న క్రిమినల్ కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించారు.
Also Read:చీకటిలో ఇండిగో విమానం!

