పదో తరగతి పరీక్షలు,లాక్ డౌన్ సడలింపులు,కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇవాళ అధికారులతో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకోనుండగా సాయంత్రం 4.30 గంటలకు కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై చర్చించనున్నారు.
జీహెచ్ఎంసీ మినహా మిగితా జిల్లాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎస్ఎస్సీ పరీక్షలను వాయిదా వేసింది.
టెన్త్ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో వాటిని రద్దుచేయాలా? నిర్వహించాలా? సాధారణ పరిస్థితులు వచ్చేది ఎప్పుడు? దీనికి ప్రత్నామ్నాయ విధానాలు ఏమిటి? వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. ఇంటర్నల్ మార్కులు, ఫార్మెటివ్, సమ్మెటివ్, ప్రీ ఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా టెన్త్ ఫలితాలు ప్రకటించి గ్రేడింగ్ ఇవ్వాలనే సూచనలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులతో జరిగే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.