UBT:ఎంపీల తిరుగుబాటు ఖాయం!

2
- Advertisement -

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన విభాగం మరో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు విడిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్ధవ్‌ను వీడి నాయకులు తిరుగుబాటు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ పార్టీ చరిత్రలో ఇలాంటి వరుస తిరుగుబాట్లు జరిగాయి.

లోక్‌సభ సభ్యులలో పార్టీ మారతాయనే ఊహాగానాల నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పార్టీ పార్లమెంట్‌లో తన స్థానాన్ని కాపాడుకోవడానికి వేగంగా అడుగులు వేసింది. సభలో తమ విభాగానికి మాత్రమే అధికారిక శివసేనగా గుర్తింపు ఇవ్వాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అధికారికంగా లేఖ రాసింది.

పార్టీ ఎంపీ…పార్లమెంటరీ పక్ష నేత అరవింద్ సావంత్ సమర్పించిన ఈ లేఖలో తమ పార్టీతో అనుబంధం ఉందని చెప్పుకునే ఏ ఇతర వర్గానికి లేదా స్వతంత్ర బ్లాక్‌కు ఎలాంటి ప్రత్యేక గుర్తింపు, హోదా, వసతులు లేదా అధికారాలను ఇవ్వవద్దని శివసేన (UBT) స్పీకర్‌ను కోరింది.

శివసేన (UBT) కి చెందిన ఏడుగురు ఎంపీలు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో టచ్‌లో ఉన్నారని….రాబోయే రోజుల్లో వారు అధికారికంగా పార్టీ మారే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. బుధవారం న్యూఢిల్లీలోని శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నివాసంలో ఆ ఎంపీలు సమావేశమై ఆ తర్వాత లోక్‌సభ స్పీకర్‌ను కలిసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కూడా పాల్గొనే అవకాశం ఉంది.

ఇద్దరు ఎంపీలు ఇప్పటికే జాతీయ రాజధానికి చేరుకోగా మరో నలుగురు ఈరోజు సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటారని భావిస్తున్నారు. ఈ నాయకులు శ్రీకాంత్ షిండే నివాసంలో చర్చలు జరిపిన అనంతరం, స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో తమ ఎంపీలందరూ ఐక్యంగానే ఉన్నారని పార్టీ వాదిస్తున్నప్పటికీ ఈ తాజా రాజకీయ పరిణామాలు శివసేన (UBT) పార్లమెంటరీ విభాగంలో చీలిక రాబోతోందనే ఊహాగానాలను మరింత తీవ్రం చేశాయి. పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న ఎంపీలపై శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్ ట్విట్టర్ (X) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు.

Also Read:నిరుద్యోగులపై లాఠీఛార్జ్ హేయమైన చర్య!

ఒక చార్టర్డ్ విమానం నాందేడ్ విమానాశ్రయంలో దిగింది. ఒక ‘ఆపరేషన్’ పేరుతో ఇద్దరు ఎంపీలను ఎక్కించుకుని అది టేకాఫ్ అయ్యింది. ఒకప్పుడు వీరు కనీసం ఆటో రిక్షాలో కూడా తిరిగే పరిస్థితిలో లేరు. కానీ ఠాక్రే అనే పేరు వల్ల వీరి విలువ ఎంత పెరిగిందంటే… ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ప్రతి చర్యకు లెక్కలు ఉంటాయి. పిరికి నక్కలు పారిపోయాయి… అలాంటప్పుడు మిమ్మల్ని మీరు పులులు అని ఎందుకు పిలుచుకుంటారు? అని ఆయన రాసుకొచ్చారు.

- Advertisement -