ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదానికేనా..?: కేటీఆర్

247
min ktr
- Advertisement -

ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదం ఇస్తే సరిపోదు.. ఇందుకు తగిన చర్యలు కూడా చేపట్టాలన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ బేగంపేటలో సీసీఐ రాష్ట్ర వార్షిక సమావేశం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… దిగుమతి సుంకాలు పెంచి.. మేకిన్‌ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే రాష్ట్రానికి అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూ వస్తున్నది. నిజానికి తెలంగాణ ఒక నవజాత శిశువు వంటిది. నూతన రాష్ట్రం తన కాళ్ళ మీద తాను నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి అన్ని రకాల సాయం అందించాల్సిన బాధ్యతను కేంద్రం ఆది నుంచి విస్మరించింది. అయినా తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి అద్భుతమైన నాయకత్వ పటిమ మరియు దీర్ఘకాలిక విజన్ తో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే అభివృద్ధి-సంక్షేమం రెండు ప్రధానమైన అంశాలుగా భావించి ముందుకుపొతున్నది. రాష్ట్రాభివృద్దిలో భాగంగా పారిశ్రామిక రంగానికి అత్యంత అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రం ఎర్పడిన తొలినాళ్లలో ఉన్న విద్యుత్ సంక్షోభం నుంచి పరిశ్రమలకు 24 గంటల పాటు కరెంటు సరఫరా అందించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుంది. దీంతోపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐపాస్ వంటి వినూత్నమైన, విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానం తీసుకువచ్చి, తెలంగాణను పెట్టుబడుల గమ్యస్ధానంగా మార్చింది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు తెలంగాణ బాట పట్టేలా కార్యాచరణ చేపట్టింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సింగిల్ విండో అనుమతుల విధానం తీసుకొచ్చి, దాదాపు 15 వేల కంపెనీలు, రెండు లక్షల 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షించింది. తద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాల కల్పన ఇప్పటిదాకా జరిగింది.

గత ఆరేళ్లుగా పారిశ్రామిక రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, విధానాలను ప్రపంచం మొత్తం అభినందించింది, అంగీకరించింది. ఐటీ పరిశ్రమ నుంచి మొదలుకొని ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్ఫేస్, ఢిపెన్స్ వంటి కీలక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించింది. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ కలిసి నిర్వహించే ఈవోడీబీ ర్యాంకింగుల్లో కూడా తెలంగాణ రాష్ర్టం క్రమం తప్పకుండా అగ్రస్థానంలో నిలుస్తు వస్తుంది. రాష్ట్రం ఏర్పడ్డ ఏడేళ్లలోనే తెలంగాణ వ్యవసాయం నుండి ఐటీ వరకు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి కనబరచింది. జీఏస్ డిపి పెరుగుదలలో దేశంలోనే మేటిగా ఉన్నది. కానీ పనిచేసే ఇటువంటి రాష్ట్రాలను ప్రోత్సాహించడంలో మాత్రం కేంద్రం విఫలమయ్యింది. ఇలా అన్ని రంగాల్లో పెర్ఫామింగ్ స్టేట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు ఎన్నడూ అందలేదు. ఎంతసేపూ కేంద్ర మంత్రులు రావడం, వివిధ వేదికల మీద రాష్ట్రాన్ని ప్రశంసించడం, వెళ్లడం తప్పితే రాష్ట్రానికి అణా పైసా మందం సాయం చేసింది లేదు. కేవలం శుష్కప్రియాలు, శూన్యహస్తాలు తప్ప.

గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్రాన్ని సంప్రదిస్తూనే ఉన్నాం… విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం… అయితే సమయం, సంవత్సరాలు గడుస్తున్నవే కానీ… కేంద్రం నుంచి సానుకూల స్పందన మాత్రం రావడం లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం మా గొంతును గట్టిగా విప్పాల్సిన అవసరం, సమయం వచ్చింది. ఈ వేధికగా కేంద్రం తెలంగాణకు పారిశ్రామిక రంగంలో చేసిన అన్యాయాన్ని మరోసారి ప్రస్తావిస్తున్నాను…

కేంద్రం నుంచి తెలంగాణకు వివిధ రంగాల్లో దక్కాల్సిన అంశాలకు సంబంధించిన వివరాలు:విభజన చట్టం హమీలు

• పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను సైతం కేంద్రం తుంగలో తొక్కింది

• విభజన చట్టంలో తెలంగాణకు ఒక ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, విద్యా సంస్ధల ఏర్పాటు లాంటి హమీలన్నింటిని గాలికి వదిలింది

• తాజాగా విభజన హామీల్లో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సైతం అవసరం లేదని తనకు అలవాటైన తెలంగాణ వ్యతిరేఖతను కేంద్రం మరోసారి ప్రదర్శించింది

• దీంతోపాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రాణాధారమైన రైల్వే నెట్వర్క్ ని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్రం చేస్తూ వస్తున్న విజ్ఞప్తులకు సైతం కేంద్రం స్పందించడం లేదు.

• ఇప్పటికే 8 రైల్వే లైన్ల నిర్మాణం పెండింగ్లో ఉండగా, మరో మూడు లైన్ల సర్వే పెండింగ్లో ఉంది. దీంతో పాటు నాలుగు నూతన రైల్వే లైన్ల ప్రతిపాదనలకు సైతం కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు

• కేంద్ర ప్రభుత్వం భారీగా ప్రచారం చేసుకుంటున్న బుల్లెట్ ట్రైన్ మరియు హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ ల్లోనూ తెలంగాణకు దక్కింది శూన్యమే

• బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పైన స్పష్టత ఇచ్చి, ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు రావాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపినా… కేంద్రం నుంచి స్పందన లేదు.

• ఐటిఐఅర్- రాష్ట్ర ఏర్పాటు కన్నా ముందే హైదరాబాద్ నగరానికి దక్కిన ఐటీఐఆర్ ను సైతం రద్దు చేసింది ఎన్డీయే ప్రభుత్వం. తద్వారా ఐటి పరిశ్రమ వృద్దిని అడ్డుకునే ప్రయత్నంతోపాటు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు మోకాలడ్డింది

• హైదరాబాద్ ఐటి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర సహాయ, సహకారాలు లేకుండానే తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఐటీ పరిశ్రమ వృద్ధిరేటును కొనసాగిస్తూనే ఉన్నది. జాతీయ సగటు కన్నా అధికంగా వృద్ధిరేటును ప్రతి సంవత్సరం నమోదు చేస్తూ, తన ఎగుమతులను రెట్టింపు చేసింది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ ఐటీ ఎగుమతులు సుమారు 57 వేల కోట్లు ఉంటే, దాన్ని ఇవ్వాళ అవి లక్షా నలభై వేల కోట్లకు చేరాయి. ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇంత ప్రగతి సాధిస్తున్నా తెలంగాణ ఐటి పరిశ్రమకు కేంద్రం నుండి ప్రత్యేక ప్రోత్సాహం కరువైంది.

• ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో హైదరాబాద్ నగరంలో ఉన్న రెండు ఈఎంసీలకు అద్భుతమైన స్పందన లభించిన నేపథ్యంలో…. అదనపు ఈఏంసీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినా ఇంకా తేల్చడం లేదు

• నూతన రాష్ట్రం అయినప్పటికీ…. దేశంలోని ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలన్న బృహత్తరమైన లక్ష్యంతో దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సింగల్ ఫార్మా క్లస్టర్ అయినా హైదరారబాద్ ఫార్మా సిటీని చేపట్టినా… ఆత్మ నిర్మర్ భారత్ లాంటి నినాదాన్ని ఎత్తుకున్న కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి మద్దతు దొరకడం లేదు. ఫార్మా సిటీ మౌలిక వసతుల కోసం 3900 కోట్లు రూపాయలు ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదు కేంద్రం.

• ఫార్మా సిటీకి సాయం చేయకపోగా…. ఫార్మా పార్కు స్కీం అంటు ఒక కొత్తదాన్ని తెచ్చి, చాటలో తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు ఏడాది కాలంగా 19 రాష్ట్రాల మధ్య పోటీ పెట్టి అనవసర కాలయాపన చేస్తున్నారు.

• ప్రపంచ వ్యాక్సీన్లలో మూడోవంతు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయి. కరోనా సంక్షోభం వచ్చినప్పుడు ప్రపంచానికి అవసరమైన హైడ్రాక్సీ-క్లోరోక్విన్, రెండెస్విర్ వంటి మందులను అందించింది మన హైదరాబాద్ ఫార్మా మరియు లైప్ సైన్సెస్ పరిశ్రమనే. ఇవ్వాళ దేశానికే కాదు, ప్రపంచానికి అవసరమైన కోవిడ్ వ్యాక్సీన్లను అందిస్తోంది హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ.

• దేశ విదేశాల నుంచి రాయబారులు వచ్చి జీనోమ్ వ్యాలీ ప్రాధాన్యతను గుర్తింస్తుంటే… కేంద్రం వైపు నుంచి మాత్రం ఇక్కడి పరిశ్రమకు కావాల్సిన ప్రత్యేక ప్రోత్సాహం ఇప్పటిదాకా లభించలేదు. దురదృష్టం ఏమిటంటే జినోమ్ వ్యాలీలో లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉంటే, వ్యాక్సీన్ టెస్టింగ్ కోసం వందల కీలోమీటర్ల దూరంలోని కసౌలీలో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ లేబరేటరీకి వెళ్లాలి. ఇక్కడే టెస్టింగ్ కేంద్రం నెలకొల్పాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం వాటిని ఖాతరు చేయడం లేదు.

• హైదరాబాదులో అద్భుతమైన ఎరోస్పేస్, డిఫెన్స్ ఎకో సిస్టం ఉన్నా కూడా కేంద్రం తలపెట్టిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లలో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదు. ఏలాంటి ఈకో సిస్టం లేని ఉత్తరప్రదేశ్ లోని బుందేల్‌ఖండ్‌కు డిఫెన్స్ కారిడార్ మంజూరు చేసి పారిశ్రామికాభివృద్ధి, పరిశ్రమ అవసరాలకన్నా, పాలిటిక్స్ కే ప్రాధాన్యత ఇచ్చింది. అన్ని అవకాశాలు ఉన్న తెలంగాణకు మాత్రం డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇవ్వాలన్న విజ్ఞప్తులు మాత్రం పట్టించుకోవడం లేదు.

• కేంద్రం ఎలాంటి సహకారం ఇవ్వకుండానే నగరంలో విస్తరిస్తున్న డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ పరిశ్రమలో రిసెర్చ్ మరియు ఇన్నోవేషన్ ను పెంచేందుకు ఒక డిఫెన్స్ ఇంకుబేటర్ మరియు సెంటర్ అఫ్ ఎక్స్ లెన్స్ మంజూరు చేయాలని అడిగినా… కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు

• దీంతోపాటు ఏయిరో ఇంజన్ కారిడార్ సైతం ప్రకటించాలని అడిగాము

• కేంద్రం ప్రకటించిన మెగా క్లస్టర్ పాలసీలో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు సాయం అందించమని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా మా విన్నపాలు చెవిటివాడి ముందు శంఖం ఊదిన చందంమే అయ్యింది. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ అయిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కి మొండిచెయ్యే మిగిలింది

• దేశంలోనే అతిపెద్దదైన వరంగల్ టెక్స్టైల్ పార్క్ కి ప్రత్యేక ఆర్థిక సహాయం కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేసిన ఒక్క రూపాయి సైతం కేంద్రం నుంచి దక్కలేదు

• 90 శాతానికి పైగా రాష్ట్రంలోని మరమగ్గాలు ఉండి, వేలాది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాము

• నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు హ్యాండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయమని అడిగాము
• ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని అడిగాం.

• అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, సీ పొర్టు సౌకర్యం లేని తెలంగాణకు ప్రత్యేకంగా ఒక డ్రై పోర్టు ఇవ్వాలని కోరినా కేంద్రం నుంచి స్పందన లేదు. ఎలాంటి సముద్రతీరం లేకుండానే తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తుల వృద్ధిరేటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉన్నది. 2019-20 సంవత్సరంతో పోల్చుకుంటే 2020-2021 సంవత్సరానికి సంబంధించి సుమారు 15.5 శాతంతో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన రీతిలో ఎగుమతుల వృద్ధిరేటును నమోదు చేసింది. దేశ ఎగుమతుల్లో ఇంత కీలకమైన పాత్ర వహిస్తున్నా… తెలంగాణకి డ్రై పొర్ట్ విషయంలో నిరాశే ఎదురైంది

• తాజాగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించిన 23 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు దక్కలేదు

పారిశ్రామిక పార్కులకు దక్కని కేంద్ర సహాయం

• తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పారిశ్రామిక అభివృద్ధి కోసం మౌళిక వసతుల కల్పనకు నూతన పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
• అందులో భాగంగానే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు, కేంద్ర టెక్స్టైల్ శాఖ నుంచి ఏలాంటి సహాయం రాలేదు
• ఫార్మాసిటీలో బల్క్ డ్రగ్ పార్క్, సుల్తాన్ పూర్ లో మెడికల్ డివైస్ పార్క్ లకు కేంద్ర ఫార్మాస్యూటికల్స్ శాఖ నుంచి దక్కింది శూన్యం
• రంగారెడ్డి జిల్లా మంకాల్ లో ప్లాస్టిక్ పార్క్ కు కేంద్ర పెట్రో కెమికల్స్ శాఖ ఇచ్చింది ఏమీ లేదు
• స్టేషన్ ఘన్ పూర్ లో లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తున్నా కేంద్రం నుంచి ఏలాంటి ప్రత్యేక సహాయం రాలేదు.

• జహీరాబాద్ నిమ్జ్ హోదా ఇచ్చినా, మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు ఇవ్వాలని కోరిన ఒక్క అణా పైసా ఇవ్వలేదు.

• ఇట్లా ఎన్నో ప్రాజెక్టులకు సాయం కోరినా, కేంద్రం నుండి ఉలుకూ పలుకూ లేదు.

దేశంలో టీకాల రాజధానిగా తెలంగాణ మారిందన్నారు. ఐటీ, లైఫ్‌ సెన్సెస్‌, ఫార్మా, నిర్మాణ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. ఐటీ ఎగుమతులు రూ.1.40లక్షల కోట్లకు చేరాయని, స్టార్టప్‌లతో తెలంగాణ ఇన్నోవేషన్‌ హబ్‌గా మారుతోందన్నారు. ఐటీఐఆర్‌ రద్దు చేసిన తెలంగాణకు న్యాయం చేశారని, తెలంగాణకు ఒక్క ఇండస్ట్రియల్‌ జోన్‌ ఇవ్వలేదని ఆరోపించారు.

- Advertisement -