ఇంద్రకీలాద్రి అమ్మవారికి శాకంబరీ శోభ

143
shakambari
- Advertisement -

ప్రతి ఏటా విజయవాడ కనకదుర్గమ్మకు ఆషాఢమాసంలో నిర్వహించే శాకంబరీ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. శాకంబరీ ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగుతాయని ఆలయ స్థానాచార్యుడు శివప్రసాద్‌ శర్మ తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు శాకంబరీ రూపంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకుంటున్నారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లను, ఆలయాన్ని 12 టన్నుల పండ్లు కూరగాయలతో అలంకరించారు. తొలుత దాతలు అందజేసిన నిమ్మకాయలు, కూరగాయలకు వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఋత్వికులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మూలవిరాట్‌ దుర్గమ్మను వివిధ రకాల పండ్లు, కూరగాయాలు, ఆకుకూరలతో అలంకరించారు.

శాకంబరీ ఉత్సవాలలో భాగంగా తొలిరోజు సోమవారం విఘ్నేశ్వర పూజ, ఋత్విక్‌ వరుణ, పుణ్యవచనం, అఖండ దీపారాధన, వాస్తు హోమం, కలశ స్థాపన పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ స్థానాచార్యుడు శివప్రసాద శర్మ వెల్లడించారు. శాకంబరీని పూజించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తొలిగిపోయి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భక్తులు విశ్వసిస్తారు. మూడు రోజులపాటు శాంకబరీ దేవిగా దర్శనమివ్వనున్న అమ్మవారిని కరుణకటాక్షాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు దాదాపు లక్షకు పైగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -