పెద్ద నోట్ల రద్దుతో రోజురోజుకు చిల్లర కష్టాలు పెరిగిపోతున్నాయి. నిత్యవసర సరుకులు కొనడానికి జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు రైల్వే స్టేషన్, బస్స్టేషన్లో కూడా కొత్త రూ. 2000లకు చిల్లర దోరకడంలేదు. ఈ రెండువేలనోటుకు మేము ఎంత మందికి చిల్లర ఇవ్వమంటారు అని బస్ కండక్టర్లు కసురుకుంటున్నారు. ఇలా ఈ పెద్ద నోట్ల తిప్పల గురించి రాస్తే రామాయణం, వింటే మహాభారతంలా ఉంది.
పాత 500,1000 నోట్ల రద్దు కారణంగా కొత్త నోట్లకు ఫుల్ డిమాండ్ ఉంది. రూ.100 నోట్లు సరిపడా లేకపోవడం.. రెండు వేల నోటుకు చిల్లర కష్టాలు ఉండటంతో కొత్త 500 నోటుకు మరింత డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రింటింగ్ యూనిట్లు రాత్రి,పగలు కష్టపడి ఈ కొత్త నోట్లను ప్రింట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడే పెద్ద పొరపాటు జరిగింది. ఈ డిమాండ్ కారణంగా తొందర్లో మార్కెట్లోకి రెండు రకాల 500 నోట్లు వచ్చాయి. దీంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రెండూ చెల్లుతాయని స్పష్టంచేసింది. ఈ రెండు 500 నోట్లలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. మహాత్మాగాంధీ నీడ, జాతీయ చిహ్నం ఉన్న స్థానం, రంగు, నోట్ల సైజుల్లో స్పష్టంగా తేడాలున్నాయి. ప్రింటింగ్ పొరపాట్ల వల్ల ఇలా జరిగిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ అధికార ప్రతినిధి స్పష్టంచేశారు.
ప్రస్తుతం ఆర్బీఐ అన్ని రాష్ట్రాలకు, బ్యాంకులకు రూ.500నోట్లను పంపించేసింది. రూ.500నోట్ల బార్డర్ సైజ్లోనూ చిన్నచిన్న తేడాలు ఉన్నట్లు గుర్తించారు. నోట్ల ముద్రణలో తేడాలుంటే దొంగనోట్లను గుర్తించడం కష్టమంటున్నారు ప్రజలు. అసలు దొంగనోట్లను అరికట్టడం సాధ్యం కాదని, పాకిస్తాన్ ఐఎస్ఐ కొత్త నోట్ల ప్రింటింగ్కు సన్నాహాలు చేస్తోందంటున్నారు బ్యాంకింగ్ నిపుణులు. అసలు పెద్దనోట్లు లేకుండా చేస్తేనే మంచిదని సలహా ఇస్తున్నారు మరికొంత మంది ఆర్థిక నిపుణులు.