ప్రపంచంలోనే టాప్ 1..తిరుమల మ్యూజియం

28
- Advertisement -

తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియం ను డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ధర్మారెడ్డి.. జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారని చెప్పారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టి, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించాం అన్నారు.

తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుంది. తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి బెంగళూరుకు చెందిన దాత శ్రీ మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించాం అని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. త్వరలో మరో తేదీ నిర్ణయించి తెలియజేస్తాం అన్నారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోంది. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నాం. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశాం. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.

భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిదేవస్థానమ్స్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ను ఇటీవల ప్రారంభించాం అని చెప్పారు ధర్మారెడ్డి. తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవడంతోపాటు విరాళాలు కూడా అందించవచ్చు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించవచ్చు అన్నారు.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ప్రసారమవుతున్న గరుడపురాణం భక్తుల మన్ననలు పొందుతోందన్నారు. యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో తిరుమల ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తాం. దాదాపు 2 వేల మంది యువతీ యువకులు పాల్గొంటారని చెప్పారు.

ఫిబ్రవరి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ జరుగనుందన్నారు. ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం.

– ఫిబ్రవరి 11 నుండి 19వ తేదీ వరకు ` శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో.

– ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు ` తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో.

– ఫిబ్రవరి 19 నుండి 27వ తేదీ వరకు ` తొండమనాడులోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో.

– ఫిబ్రవరి 28 నుండి మార్చి 8వ తేదీ వరకు `తరిగొండలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో జరుగుతుందన్నారు.

జనవరి నెలలో శ్రీవారిని 20.78 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. హుండి ద్వారా రూ.123.07 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ` 1.07 కోట్లు.

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ` 37.38 లక్షలు.

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 7.51 లక్షలుగా ఉందన్నారు.

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందిందన్నారు. తిరుపతికి చెందిన ఆల్ ఇండియా ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన ట్రస్టుకు చెందిన శ్రీమతి ఉమామహేశ్వరి దంపతులు 10 లక్షలు విరాళం అందించారు. ఈ మేర‌కు విరాళం డిడిని శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అంద‌జేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -