ఢిల్లీలో గులాబీ జెండా :కేసీఆర్

194
- Advertisement -

బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు ఉద్దేశిస్తూ ప్రసగించారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొని తర్వాత నేరుగా తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకొని, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తెలంగాణ భవన్‌లో త్రైలోక్య మోహన గౌరీ అమ్మవారికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు సీఎంను ఆశీర్వాదించారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ పూజా కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో సీఎం కేసీఆర్ గుమ్మడికాయ కొట్టించారు. మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల దివ్య ముహూర్త సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారిక పత్రాలపై పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. అనంతరం జయజయధ్వానాల మధ్య, బీఆర్ఎస్ పార్టీ గులాబీ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు తొలి పలుకులతో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర రావు మాట్లాడారు. బిఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలు అభిమానుల కేరింతలతో, బాణాసంచా కాల్పులతో మారుమోగింది. దేశ్ కి నేత కేసీఆర్, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, బిఆర్ఎస్ జిందాబాద్ నినాదాలతో మారుమోగింది. ఉత్తమమైన గుణాత్మకమైన మార్పు కోసం ఉన్నతస్థాయికి చేరుకునే ఆర్థిక ప్రగతి కోసం బీఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తుందన్నారు.

బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఎగుర వేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు పిడికెడు మందిమి వేలై, లక్షలై ఉప్పెనలా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఊహించని రీతిలో దేశానికే మార్గదర్శనం చేస్తున్నం. అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్నం. ఇవాళ మన టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సంఖ్య 60 లక్షలు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, చైర్మన్లుగా, సర్పంచులుగా లక్షలాదిమంది నాయకత్వం తయారైంది. కరోనా క్లిష్ట సమయంలో దేశమంతా ఆర్థికంగా వెనుకకు పోయినా, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఆర్థిక క్రమశిక్షణ, నియంత్రణతో నిలదొక్కుకున్నదన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ పార్టీల వల్ల దేశానికి ఏమాత్రం లాభం చేకూర్చలేవని మండిపడ్డారు. దేశంలో అద్భుతమైన జల వనరులు సాగుభూమి సమశీతోష్ణ వాతావరణం లాంటి ఆంశాలు ఈ ప్రపంచంలో మరేదేశానికి లేదన్నారు. మానవ వనరులను వాడుకోలేక పోతున్నం. అద్భుతమైన యువ సంపత్తి నిర్వీర్యమై పోతున్నది. యువతను మతోన్మాదులుగా మార్చే కుట్రలు జరుగుతున్నయి. దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇది బీఆర్ఎస్ నుంచే ప్రారంభం కావాలె. ఇందులో భాగంగా దేశంలో భావజాల వ్యాప్తిని, దేశ ప్రజలను చైతన్యం చేయాల్సి ఉంది.

నూతన జాతీయ విధానాల అవసరం

నూతన వ్యవసాయ విధానం
ఇన్నాళ్ళు పాలించిన కేంద్ర పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ, ఈ దేశ సమగ్రాభివృద్ధికి, అనేక రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించడం కోసం జాతీయ విధానాలు రూపొందించాల్సిన అవసరముందని సీఎం అన్నారు. వ్యవసాయాధారిత భారతదేశంలో వ్యవసాయరంగం రోజురోజుకీ నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ దేశానికి నూతన వ్యవసాయ విధానం అవసరమున్నది.

నూతన జలవిధానం
అదనపు నీటి వనరులున్నా నీటి కోసం యుద్ధాలు జరగడం శోచనీయం. చెన్నై లాంటి మహానగరానికి బకెట్ నీళ్ళు దొరకని దుస్థితి ఏమిటి? ఇదే సమస్య పై బాలచందర్ లాంటి దర్శకుడు తన్నీర్ తన్నీర్ అనే సినిమా తీస్తే ఆ నీటి బాధకు ప్రజలు దాన్ని సూపర్ హిట్ చేసే పరిస్థితులున్నాయి. ఇటువంటి అసంబద్ధ విధానాలను సరిచేయాల్సి ఉన్నది. కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు, కర్నాటక వంటి సహచర రాష్ట్రాలు చేస్తున్న యుద్ధాలను చక్కదిద్దాల్సి ఉన్నది.

దిక్కుమాలిన ట్రిబ్యునల్స్ పేరుతో నీటి యుద్ధాలను కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి బాగు చేయాల్సి ఉన్నది. ఇందుకోసం ఈ దేశానికి నూతన జలవనరుల పాలసీ కావాలి. ఈ దేశంలో లక్షలాది మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునే ప్రకృతి వనరులున్నయి. అయినా పల్లె పల్లెకూ విద్యుత్ అందించుకోలేక పోవడాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. అందుకు నూతన విద్యుత్ పాలసీ కావాలి. ఆర్థికంగా ఉజ్వలమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నా ఫారిన్ ఎక్సేంజీ నిల్వలు ఎందుకు తరిగిపోతున్నాయి. డాలర్ ముందు మన రూపాయి విలువ ఎందుకు వెలవెలబోతున్నది. అందుకోసం నూతన ఆర్ధిక విధానం కావాలి.

నూతన పర్యావరణ విధానం
ఈ దేశంలో అద్భుతమైన ప్రకృతి సంపద ఉన్నా.. పచ్చదనానికి కొరత ఎందుకున్నది. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో నూతన పర్యావరణ పాలసీ ( తేవాల్సి ఉన్నది. అదే సందర్భంలో ఈ ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో సమన్యాయం, సామాజిక న్యాయం ఇంకా జరగడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలకు అభివృద్ధి ఫలాలను ఈ దేశ పాలకులు అందించలేకపోతున్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం తెలంగాణ అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తితో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నూతన విధానం తేవాల్సిన అవసరం ఉన్నది.

 మహిళా సాధికారత విధానం
దేశ జనాభాలో 50శాతం ఉన్న మహిళలను అనేకరకాలుగా వివక్షకు గురిచేస్తూ, దేశ అభివృద్ధిని కుంటు పడేలా చేస్తున్న విధానాలను సమీక్షించుకోవాల్సి ఉన్నది. దేశ ప్రగతిలో మహిళలను మరింత భాగస్వాములను చేసే దిశగా మహిళా సాధికారత విధానం తేవాల్సి ఉంది. అంతే కాకుండా, విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధి పరచడానికి ఆయా రంగాల్లో తెలంగాణ స్ఫూర్తితో వినూత్నమైన ప్రగతికాముక విధానాలను రూపొందించి బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తుంది. ఇందుకోసం ఈ విధివిధానాల రూపకల్పన కోసం మాజీ జడ్జీలు ప్రముఖ ఆర్థిక, సామాజిక వేత్తలతో, మేధావులతో కసరత్తు కొనసాగుతున్నది.

పేదల సంక్షేమ పథకాల రూపకల్పన
తెలంగాణలో అమలు చేస్తున్నట్టు భారత ప్రజలు అవకాశమిస్తే రెండేండ్లలో బిఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం 24 గంటల పాటు కరెంటును అందించగలదు. సంవత్సరానికి 25 లక్షల కుటుంబాలకు దళితబంధును అందించగలం. దేశాన్ని నూతన ఆలోచన దిశగా వినూత్న ప్రగతి ఒరవడిని సృష్టించడానికి బిఆర్ఎస్ నడుంకడుతుంది.

రాజకీయాల్లో ప్రజలే గెలవాలనే పద్ధతికి బిఆర్ఎస్ ద్వారా శ్రీకారం చుట్టబడాలె. దేశానికి దేశమే సమాన హక్కులతో పరిఢవిల్లబడాలి. పాలనలో నియంతృత్వ ధోరణి పోవాలె. ఫెడరల్ స్ఫూర్తి కొనసాగాలె. స్వయంపాలన విధానం అమలు కావాలె. దళిత, బహుజన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలె. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోగలిగనం కాబట్టీ తెలంగాణను సాధించుకోగలిగినం. అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకోగలిగినం. అదే స్ఫూర్తితో ఈ వాస్తవాలన్నింటిని దేశ ప్రజల ముందుకు తీసుకుపోయి అర్థం చేయించగలిగినప్పుడు ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఆటంకాలను ఎదుర్కొంటూ, అవమానాలను భరిస్తూ ముందుకు సాగుతూ ఎక్కడ మంచి కోసం విప్లవాత్మక కార్యాచరణకు బీజాలు పడతాయో అక్కడ తప్పకుండా విజయం సాధ్యమవుతుంది అనేది చరిత్ర నిరూపించిన సత్యం.

బిఆర్ఎస్ అనే వెలుగుదివ్వెను దేశం నలుమూలలకు వ్యాపింపచేద్దాం. తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల ముందు పెట్టి దేశ ప్రతిష్టను ద్విగుణీకృతం చేసి భరతమాత సంతృప్తిచెందేలా బిఆర్ఎస్ తో మన ప్రయాణం కొనసాగిద్దాం. దేశ సౌభాగ్యం కోసం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న దేశ రైతాంగం కోసం, ఉత్పత్తి కులాల, సబ్బండ వర్గాల సౌభాగ్యం కోసం “అబ్ కీ బార్ కిసాన్ సర్కార్” అనే నినాదంతో బిఆర్ఎస్ ముందుకుపోతుంది.

జేడీఎస్ మద్దుతు
రాబోయే కర్నాటక ఎన్నికల్లో మనం జెడిఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తూ ప్రచారంలో పాల్గొంటాం. మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నాటక ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని, జెడిఎస్ పార్టీని గెలిపించి కుమారస్వామిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం. అందుకు తెలంగాణలో అమలవుతున్న విద్యుత్, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం తదితర పథకాలను వారికి వివరిద్దాం. గతంలో కర్నాటక పోయినప్పుడు చెప్పినట్టే కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. భగవంతుని కృపతో, మన పట్టుదలతో మరోసారి సీఎం అవుతాడనే విశ్వాసం ఉంది. బిఆర్ఎస్ జాతీయ రాజకీయ ప్రస్థానం కర్నాటకతోనే ప్రారంభం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు మనం తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో ప్రజల్లోకి పోయి సాధించుకున్నాం. నేడు భారతదేశ అభివృద్ధి గుణాత్మక మార్పు లక్ష్యంగా భారత రాష్ట్ర సమితిగా పరిణామం చెందడం చారిత్రక అవసరం.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, రాజ్యసభ, లోక్ సభ పక్షనేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావుతో పాటు రాజ్యసభ, లోక్ సభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, మేయర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, అన్ని కార్పోరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నాయ‌కులు, హర్యానా నుంచి గుర్నామ్ సింగ్, ఒడిస్సా నుండి అక్షయ్ కుమార్, హిమాంశు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి కుమారస్వామి

బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ…

తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పూజలు

- Advertisement -