పాత నోట్ల మార్పిడికి గురువారంతో సమయం అయిపోయింది. పాత నోట్లను ఖాతాదారులు తమ ఖాతాల్లో డిపాజిట్ చేయ్యాల్సిందేనన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో చాలా మంది దిగాలు పడిపోయారు. అయితే, ఆర్బీఐ కొంత ఊరటను ఇచ్చింది. రూ. 500, రూ. 1000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌంటర్ల వద్ద మార్చుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ సదుపాయం ఇతర బ్యాంకుల కౌంటర్ల వద్ద ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు, రూ. 500 నోట్లతో డిసెంబర్ 15 దాకా కొన్ని చెల్లింపులను చేసుకునే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే.
రూ.2.5 లక్షలకు మించి బ్యాంకు ఖాతాల్లో జరిగే నగదు జమలపై ఐటీ శాఖ కన్ను ఉంటుందని అధికార వర్గాలు గతంలోనే ప్రకటించాయి. దీనికి భయపడి కొంతమంది తమవద్దనున్న కరెన్సీ నోట్లను నాశనం చేసినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. రద్దయిన నోట్లను ఉపయోగించుకుని ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గుప్తాదాయాన్ని వెల్లడించడానికి ప్రకటించిన పథకంలో పన్ను, అపరాధ రుసుముల రూపేణా 45% వసూలు చేసినందువల్ల ఇప్పుడు దానికంటే ఎక్కువే ఉండాలని కేంద్రం యోచిస్తోంది. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని గత ఏడాది వెల్లడించిన వారు 60% పన్నును చెల్లించడంతో తాజాగా బినామీ డిపాజిట్లపైనా అదే స్థాయిలో విధించాలనేది ప్రభుత్వ ఉద్దేశం.
జీరో బ్యాలెన్స్తో తెరిచిన జన్ధన్ అకౌంట్లలో సుమారు రూ.21,000 కోట్లు గత రెండు వారాల్లోనే జమ అయిందని బ్యాంకులు నివేదించిన విషయాన్ని కేబినెట్లో చర్చించినట్లు తెలిసింది. రెండు వారాల్లోనే ఇంత డబ్బు వచ్చి చేరడంతో… ఇది నల్లడబ్బే కావచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. బ్యాంకుల్లో పెద్దమొత్తంలో జమ చేసిన నల్లధనంపై పన్ను విధించాలని కేంద్రం పట్టుదలతో ఉంది.