ఆదివారం రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో ప్రధాన నరేంద్ర మోదీ మాట్లాడారు. రెండో దశలో కరోనా వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి దశ కరోనాను విజయవంతంగా ఎదుర్కోగలిగామని తెలిపారు. రెండో దశ కరోనా విజృంభణ నేపథ్యంలో తాము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆక్సిజన్, ఫార్మా కంపెనీల ప్రతినిధులతో చర్చించామని తెలిపారు. కచ్చితమైన సోర్సు నుంచే కరోనాపై వివరాలు తెలుసుకోవాలని, తప్పుడు ప్రచారాలు నమ్మకూడదని ప్రధాని చెప్పారు.
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ప్రధాని సూచించారు. వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం ఎలాంటి వివక్ష చూపడంలేదని, అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిందని చెప్పారు. ప్రస్తుతం 45 ఏండ్లకు పైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ తీసుకుంటున్నారని, మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లు పైబడి ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉచిత వ్యాక్సినేషన్ ఫలాలు సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరేలా చూడాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.