ప్రికాష‌న్‌ డోస్‌కు అనుమ‌తివ్వండి.. మంత్రి హరీశ్‌ విజ్ఞప్తి..

118
Minister harish rao
- Advertisement -

ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్రికాష‌న్‌ డోస్‌కు అనుమ‌తివ్వాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరిశ్ రావు కేంద్ర ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు. నిక్షయ్ మిత్ర క్యాంపెయిన్, రాష్ట్రీయ నేత్ర జ్యోతి అభియాన్, హర్ ఘర్ దస్త్రక్ క్యాంపెయిన్-2.o పై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మనుసుక్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా వెంగల్ రావు నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం నుండి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరిశ్ రావు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు, సూచనలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న టీబీ నిర్మూలన, కంటి పరీక్షలు, కరోనా వాక్సినేషన్ కార్యక్రమాల గురించి వివరించారు.

పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ల రూపంలో క‌రోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో రెండు డోసులు పూర్తి కాని అర్హులైన వారికి ప్రికాష‌న‌రీ డోస్ ఇవ్వడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుందన్నారు. ప్ర‌భుత్వ వైద్యంలో ప్ర‌స్తుతం 60 ఏళ్లు దాటిన వారికి మాత్ర‌మే ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించిన కేంద్రం.. 18 ఏళ్లు పైబ‌డిన వారికి ఏప్రిల్ 10 నుంచి ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు కేవ‌లం ప్రైవేటు ఆసుప‌త్రుల‌కే అనుమ‌తించింది. ఈ క్ర‌మంలో ప్రైవేటుతో పాటు ప్ర‌భుత్వ కేంద్రాల్లోనూ 18-59 ఏళ్ల వ‌య‌స్సున్న‌ వారికి ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించాల‌ని గతంలో కేంద్రానికి రెండు సార్లు లేఖ రాశామన్నారు. తాజాగా మరోసారి వీసీలో కేంద్రాన్ని కోరారు మంత్రి హరీశ్‌.

రాష్ట్రంలో వాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతుందని మంత్రి హరీశ్ రావు కేంద్ర మంత్రికి వివరించారు. జూన్ 3న రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటింటికి వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి వాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 12 ఏళ్లుపై బడిన వారికి మొత్తంగా.. మొదటి డోసు 104.78%, రెండో డోసు 99.72% పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. టీబీ నిర్మూలన కోసం అమలు చేస్తున్న నిక్షయ్ మిత్ర కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తామని చెప్పారు. కంటి ఆపరేషన్లు మరింత పెంచేలా టీచింగ్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో పేఖో మిషన్లు సమకూర్చి, లక్ష్యం చేరుతామని మంత్రి తెలిపారు.

- Advertisement -