సిక్కిం రాష్ట్రం భారత యూనియన్లో విలీనమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ‘స్వర్ణ జయంతి’ వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మంగళవారం గాంగ్టక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ₹4,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు.
నామ్చి జిల్లాలోని యంగాంగ్లో 100 పడకల ఆయుర్వేద ఆసుపత్రికి ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే ఎన్ఐటీ (NIT) డియోరాలీలో 30 పడకల ఇంటిగ్రేటెడ్ ‘సోవా రిగ్పా’ (Sowa Rigpa) ఆసుపత్రిని ప్రారంభించారు.
విద్యారంగం: యంగాంగ్లో సిక్కిం విశ్వవిద్యాలయం శాశ్వత క్యాంపస్, చకుంగ్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ ఆఫ్ ఎక్సలెన్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, గ్యాంగ్టక్లో హెలెన్ లెప్చా మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వీటితో పాటు 160 పాఠశాలల్లో ఐటీ ఆధారిత విద్యా మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రారంభించారు.
తీస్తా నదిపై నిర్మించనున్న రెండు భారీ స్టీల్ ఆర్చ్ బ్రిడ్జిలకు శంకుస్థాపన చేశారు. గ్యాంగ్టక్లో కొత్తగా నిర్మించిన ‘జనసేవ సచివాలయం’ (మినీ సెక్రటేరియట్), సివిల్ సర్వీస్ అధికారుల సంస్థను ప్రారంభించారు.
Also Read:అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం!
కైలాష్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి పర్యాటక సౌకర్యాలను, సిక్కిం ఇఫ్కో (IFFCO) ప్రాసెసింగ్ ప్లాంట్ను ప్రారంభించారు. ఇది రాష్ట్రంలోని రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తోడ్పడనుంది. సిక్కిం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్రాజెక్టులు రాష్ట్ర రూపురేఖలను మారుస్తాయని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పర్యాటకం, విద్య, ఆరోగ్య రంగాల్లో సిక్కిం సాధిస్తున్న ప్రగతిని ఆయన కొనియాడారు.

