రైతుకు మించిన శాస్త్రవేత్త లేడు- మంత్రి నిరంజన్ రెడ్డి

147
Minister Niranjan Reddy
- Advertisement -

మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వ్యవసాయరంగంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి,పువ్వాడ అజయ్, జగదీశ్వర్ రెడ్డిలు హాజరైయ్యారు. 2021 – 2022 ఏడాదికి గాను రైతులకు రైతుభీమా నిమిత్తం రూ.1450 కోట్ల చెక్కు ఎల్ఐసీ ఆఫ్ ఇండియాకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం పరిశ్రమగా వర్ధిల్లాలి.. వ్యవసాయరంగ బలోపేతమే తెలంగాణ ప్రభుత్వలక్ష్యం. ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి అత్యంత ఇష్టమైనది వ్యవసాయ రంగం. తెలంగాణలో 35 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటికి కరంటు మీద 5,6 లక్షల మోటార్లు నడుస్తుంటే 30,35 లక్షల డీజిల్ తో రైతులు ఇంజన్లు నడుపుకుంటుండడం గమనార్హం. అత్యధిక శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగం అని మంత్రి తెలిపారు. రాబోయే తరాలను వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాల వైపు నడిపించాలి.

ఆహారం లేనిది జీవరాశి మనుగడ లేదు.. ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు. అందుకే ప్రపంచ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే వ్యవసాయరంగం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. చైనాలో అత్యధిక ఉత్పత్తి ఉన్నా అవి ఆ దేశ అవసరాలకే సరిపోతున్నాయి.. కేవలం సిల్క్ మాత్రమే ఆ దేశం ఎగుమతి చేస్తుంది. అమెరికాలో అత్యధిక సాగుభూమి ఉన్నా వ్యవసాయం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. వ్యవసాయరంగాన్ని పరిశ్రమగా మార్చేందుకు ఏ విధమైన కార్యాచరణ చేయాలో మంత్రివర్గ ఉపసంఘం గుర్తించాలి అన్నారు. యాసంగిలో వేరుశెనగ సాగు వైపు రైతులను మళ్లించేందుకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలి. తెలంగాణలో ఆప్లాటాక్సిన్ రహిత వేరుశెనగ రావడం ప్రపంచమార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది. నూతన వేరుశెనగ వంగడాలను కనుగొనేందుకు పరిశోధన కేంద్రం ఏర్పాటుతో ప్రోత్సహించడం జరుగుతుంది. వేరుశెనగ ఉప ఉత్పత్తులు (ఉదా: చిక్కీ – అంగన్ వాడీ, ప్రభుత్వ పాఠశాలలు ) ప్రభుత్వమే తీసుకుంటే దానికి ప్రాధాన్య పెరుగుతుందని మంత్రి అన్నారు.

వరి ధాన్యం నుండి ఇథనాల్‌గా మార్చే పరిశ్రమలను విరివిగా ఏర్పాటు చేసే విషయం పరిశీలిద్దాం. స్థానికంగా విత్తన లభ్యత ఉంటే ఆలుగడ్డ సాగును తెలంగాణలో విస్తృతంగా పెంచుకోవచ్చు. తెలంగాణ వచ్చేనాటికి వ్యవసాయ ఉత్పత్తుల విలువ రూ.40 వేల కోట్లు కాగా, నేడు ఆ ఉత్పత్తుల విలువ రూ.94,500 వేల కోట్లు కావడం ఆనందదాయకం.సమస్త సమాచారం లభించేలా రైతు సమీకృత కేంద్రాలుగా రైతువేదికలు నిలవాలి. అగ్రి స్టార్టప్ లను ప్రోత్సహించాలి.. రైతుకు మించిన శాస్త్రవేత్త లేడు. అవసరానికి తోడు, ఆసక్తి ఉండడం మూలంగానే నూతన ఆవిష్కరణలు సాధ్యం అవుతాయి. సహకారరంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 150 సహకారసంఘాలు రాష్ట్రంలో చురుకుగా పనిచేస్తున్నాయి.. మిగతా సంఘాలను బలోపేతం చేద్దామన్నారు.మహారాష్ట్ర రైతుసహకార సంఘాలను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి..దానిని తెలంగాణలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో అధ్యయనం చేద్దాం.ప్రపంచంలో ఒక్క తెలంగాణలోనే రైతుబంధు, రైతుభీమాతో రైతుకు నేరుగా సాయం అందిస్తున్న ఏకైక నేత కేసీఆర్..రైతుసంపద జాతి సంపద అని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -