మంత్రి కేటీఆర్ నాయనమ్మ వెంకటమ్మ స్మారకార్ధం వారి గ్రామమైన కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్లో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత నిధులతో నిర్మించే నూతన ప్రభుత్వ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎంపీ శ్రీ బీబీ పాటిల్ పాల్గొన్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. పలు ఆసక్తికర విషయాలను కేటీఆర్ సభా వేదికగా వెల్లడించారు. మానేరు ప్రాజెక్టుకు తమ కుటుంబానికి ఏదో అనుబంధం ఉందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఈ అనుబంధం గురించి తెలియజేసేందుకు కేటీఆర్ తమ పూర్వీకుల కథ చెప్పుకొచ్చారు. నానమ్మ ఊరు అప్పర్ మానేరులో, అమ్మమ్మ ఊరు మిడ్ మానేరులో, ఇంకో అమ్మమ్మ(అమ్మ సోదరి) ఊరు కూడా లోయర్ మానేరులో మునిగిపోయిందని కేటీఆర్ గుర్తు చేశారు. నానమ్మ, అమ్మమ్మల జ్ఞాపకార్థంగా మన ఊరు – మన బడి ప్రోగ్రాం కింద తన సొంత ఖర్చులతో పాఠశాలలను నిర్మిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.