రైతుకు నాణ్యమైన విత్తనం అందాలి…

102
niranjan reddy
- Advertisement -

ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న ఇస్టా కాంగ్రెస్ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ,ప్రపంచ ఆకలి తీరాలి అంటే,రైతుకు నాణ్యమైన విత్తనం అందాలి అన్నారు. ప్రపంచంలో 800 మిలియన్ ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని, 2 బిలియన్లకు పైగా ప్రజలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల అనేది అన్ని దేశాలకు అత్యంత ముఖ్యమైనదన్నారు.

2030 నాటికి జీరో హంగర్ లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. రైతులకు మంచి నాణ్యమైన విత్తనాలు లభించనంత వరకు పరిశోధనలు, రైతుల పంట పెట్టుబడి వృధా అవుతుందన్నారు. అంతర్జాతీయ సంస్థ అయిన ఇస్టా విత్తన నమూనా మరియు పరీక్షల కోసం ప్రామాణిక పద్ధతులను అభివృద్ధి చేసి, విత్తన పరిశోధనను ప్రోత్సహించడం మరియు విత్తన శాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యవసాయం, విత్తన పరిశ్రమలు మరియు విత్తన వ్యాపారానికి మద్దతు ఇస్తుందని, భావిస్తున్నాను అని ప్రస్తావించారు.

భారత్ దేశం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ గల దేశం, ఇక్కడ విభిన్న వాతావరణ పరిస్థితులలో విస్తృత శ్రేణి పంటల సాగు జరుగుతున్నదన్నారు.  ప్రపంచ  విత్తన పరిశ్రమ వృద్ధి రేటు 5% అయితే భారతీయ విత్తన పరిశ్రమ వృద్ధి రేటు  12-15%తో ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నదన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విత్తన పరిశ్రమలలో భారత్ ఒకటి అన్నారు. 2014 – 15 నుండి 2020 – 21 మధ్యలో తెలంగాణ విత్తన పరిశ్రమ  వృద్ధి రేటు 85 శాతం కావడం విశేషం అని పేర్కొన్నారు. తెలంగాణలో నాణ్యత హామీ వ్యవస్థలను మెరుగుపరచడంలో ఇస్టాతో కలిసి పని చేయడం సంతృప్తినిస్తున్నదన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి, విత్తన పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు.  కేసీఆర్ దిశానిర్దేశం మేరకు తెలంగాణ వ్యవసాయోత్పత్తి  2014-15లో  20.7 మిలియన్ మెట్రిక్ టన్నుల నుండి 38.3 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. అనేక బహుళజాతి మరియు జాతీయ విత్తన కంపెనీలు తెలంగాణలో ఉండటం వలన 1/3 శాతం దేశ విత్తన అవసరాలను తెలంగాణ తీరుస్తున్నది అన్నారు. 20కి పైగా దేశాలకు విత్తనాల ఎగుమతి తెలంగాణ నుండి కొనసాగుతున్నదన్నారు.

2019లో హైదరాబాద్ లో ఇస్టా కాంగ్రెస్ అంతర్జాతీయ సదస్సు తెలంగాణ విత్తనరంగం బలోపేతానికి ఎంతో దోహదం చేసిందన్నారు. ఈ సదస్సులోనే  తొలిసారి ఆసియా నుండి డాక్టర్ కేశవులు ఇస్టా వైస్ ప్రెసిండెంట్ గా ఎన్నికయ్యారని తెలిపారు. ఈజిప్ట్‌తో సహా వివిధ దేశాలకు అంతర్జాతీయ (OECD) విత్తన ధృవీకరణ ద్వారా విత్తన ఎగుమతులను ప్రోత్సహించడం, ఇస్టా గుర్తింపుతో ప్రపంచ స్థాయి విత్తన పరీక్షా ప్రయోగశాల ఏర్పాటు వంటి అనేక కొత్త కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈజిప్టుతో OECD విత్తన ఎగుమతులు ప్రారంభమయ్యాయని, భవిష్యత్ లోను తమ సహకారం కొనసాగిస్తాం అని తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఇస్టా పూర్వపు ప్రెసిడెంట్ డాక్టర్ క్రెగ్ ఎంసి గిల్, ఇస్టా ప్రధాన కార్యదర్శి డాక్టర్ అండ్రూస్ వైస్, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ, ఇస్టా వైస్ చైర్మన్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -