బయో ఆసియా సదస్సు..కేటీఆర్ చిట్ చాట్

67
- Advertisement -

2028 నాటికి రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం విలువను రెట్టింపు చేస్తామన్న లక్ష్యాన్ని మరోసారి ప్రకటించారు మంత్రి కేటీఆర్. బయో ఆసియా సదస్సు నేపథ్యంలో విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు కేటీఆర్. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల విలువ కలిగిన లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టంను రెట్టింపు చేస్తాం అన్నారు. 4 లక్షల ప్రస్తుత ఉద్యోగాల సంఖ్యను రెట్టింపు చేసి 8 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తాం అన్నారు. బయో ఆసియా ప్రాముఖ్యతతోపాటు జీవశాస్త్ర, ఫార్మా రంగాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న చర్యల గురించి వివరించారు. 19 సదస్సులను పూర్తిచేసుకుని ఈసారి ప్రతిష్టాత్మకమైన 20వ సదస్సును నిర్వహించుకోబోతున్నాం అన్నారు. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు ఈ సదస్సు ఉంటుందన్నారు.

అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌: షషేపిగ్ నెక్ట్స్ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌ అన్న ఇతివృత్తంతో జరగనున్న 20వ బయో ఆసియా సదస్సు జరగనుందన్నారు. బయో ఆసియా గత పంతొమ్మిది ఏళ్లలో మూడు బిలియన్ డాలర్లు సుమారు 24 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చిందన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడుల్లో కొన్ని ఆంధ్రప్రదేశ్‌కూ వెళ్లాయన్నారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ రంగానికి బయో ఏసియా విస్తృతమైన సేవలను అందించిందన్నారు. దేశ లైఫ్ సైన్సెస్ రంగంలోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ సదస్సు విజయం సాధించిందన్నారు.

వందకుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్‌ అవార్డు గ్రహీతలకు ఆతిథ్యం ఇవ్వగలిగామని, 20 వేలకుపైగా భాగస్వామ్య చర్చలు జరిగాయన్నారు. 30 పాలసీ పేపర్లు, సిఫార్సులను ఈ సదస్సు అందించిందన్నారు. 100 దేశాలు ఇప్పటిదాకా ఈ సదస్సులో పాల్గొన్నాయని…గత 20 సంవత్సరాలలో 250 కి పైగా అవగాహన ఒప్పందాలను ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవడంలో ఈ సదస్సు భాగస్వామిగా ఉందన్నారు. ఇప్పటికే అనేక దేశాలు భాగస్వామ్య కంట్రీల హోదాలో ఏషియాలో పాల్గొన్నాయని చెప్పారు కేటీఆర్.

ఈసారి కూడా పలు దేశాలు బయోఏషియాతో భాగస్వామ్య దేశం హోదాలో పాల్గొంటున్నాయని…ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా…బయో ఆసియా సదస్సు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం ఉందన్నారు. తొలిసారి ఆపిల్‌ కంపెనీ కూడా పాల్గొంటోందని…జీవశాస్త్ర రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మసిటీ, మెడికల్ డివైసెస్ పార్క్, బయోఆసియాతోపాటు అనేక ఇతర ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో జీవశాస్త్ర రంగం విలువ, ఉద్యోగాలు కూడా 2028 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యం అన్నారు.

2021లో హైదరాబాద్‌ దాని పరిసరాల్లోని జీవశాస్త్ర రంగ కంపెనీల ఏకో సిస్టమ్ విలువ 50 బిలియన్‌ డాలర్లు ఉండగా 2028 నాటికి దీన్ని వంద బిలియన్‌ డాలర్లకు చేరేలా ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ప్రస్తుతం ఈ రంగంలోని నాలుగు లక్షల ఉద్యోగాలను ఎనిమిది లక్షలు చేస్తామన్నారు. భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు ప్రబలితే ఆదుకోగల స్థాయిలో హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఉండబోతోందన్నారు.

జీవశాస్త్ర రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఫార్మాసిటీ ఏర్పాటుతో మరింత ఎత్తుకు ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ విషయంలో కోర్టుల్లో ఉన్న కేసులపై విచారణ ముగిసిందని, న్యాయమూర్తులు రిజర్వ్‌ చేసిన తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందన్న నమ్మకం వ్యక్తం చేశారు కేటీఆర్. జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్‌ ఇప్పటికే ప్రపంచంలోనే అతి కీలకమైన కేంద్రంగా మారిందని, ఏటా 900 కోట్ల టీకాలు తయారు చేస్తోందని మంత్రి చెప్పారు. త్వరలోనే ఈ సంఖ్య 1400 కోట్లకు చేరుతుందని, ‍టీకాలన్నింటిలో తెలంగాణ వాటా 50 శాతానికి చేరుతుందని తెలిపారు.

అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆమోదిత ఫార్మా కంపెనీలు అత్యధికంగా 214 ఉండటం, సుల్తాన్‌పూర్‌లోని మెడికల్‌ డివైజెస్‌ పార్కు, త్వరలో ప్రారంభం కానున్న ఫార్మాసిటీ వంటివి హైదరాబాద్‌ను జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నది కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంల ఎంఆర్‌ఎన్‌ఏ టీకా కేంద్రం కూడా త్వరలో హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తూండటం కూడా జీవశాస్త్ర రంగానికి, ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మసిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. హైదరాబాద్ ఫార్మాసిటీకి కేవలం జాతీయ స్థాయి ప్రాధాన్యతనే కాకుండా అంతర్జాతీయ స్థాయి ప్రాథమిక కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచానికి అత్యంత కీలకమైన ప్రాంతంగా ఆవిర్భవించిందన్నారు. పరిశ్రమ ప్రయోజనాలు, పారిశ్రామిక అభివృద్ధి కన్నా కేవలం రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. సరైన నాయకత్వం చిత్తశుద్ధి ఉంటే ఎన్ని అడ్డంకులనైనా దాటుకొని అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్రం నిరూపించిందన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -