మెటా సంస్థ బాలల లైంగిక వేధింపుల కేసులను మరియు బాలల భద్రతకు సంబంధించిన ఇతర అంశాలను సంబంధిత రక్షణ దళాలు (లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు) నివేదించడానికి అంగీకరించింది. ఆన్లైన్లో హానికరమైన కంటెంట్పై సోషల్ మీడియా వేదికలతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విస్తృత చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. భారత్లో పనిచేస్తున్న సోషల్ మీడియా కంపెనీలకు డిజిటల్ వేదికలపై పిల్లల భద్రత ప్రాథమిక షరతు అని, ఈ విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
భారత్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ పనిచేయడానికి ఆన్లైన్లో పిల్లల భద్రత అనేది ఒక ప్రాథమిక సూత్రమని అది అంగీకారయోగ్యం కాని విషయమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసినట్లు తెలిపింది. పిల్లల భద్రతా వ్యవహారాలను చట్ట అమలు సంస్థలకు నివేదించడానికి మెటా తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తున్న పిల్లల రక్షణను బలోపేతం చేయడానికి తొలి అడుగు మాత్రమేనని వర్గాలు తెలిపాయి. అయితే, ఆన్లైన్ వేదికలను పిల్లలకు మరింత సురక్షితంగా మార్చేందుకు మరిన్ని చర్యలు అవసరమని ప్రభుత్వం సూచించింది.
ప్రభుత్వ చర్చలు కేవలం మెటాకే పరిమితం కాలేదు. హానికరమైన కంటెంట్ను, ముఖ్యంగా పిల్లలకు ప్రమాదం కలిగించే మెటీరియల్ను ముందస్తుగానే గుర్తించి తొలగించేలా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లతో కూడా చర్చిస్తోంది. పిల్లలను ఆన్లైన్ హానికర కంటెంట్ నుండి కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోని వేదికలపై చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అబ్యూస్ మెటీరియల్ (CSEAM)కు సంబంధించిన ప్రకటనల ఆరోపణలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) మెటాపై విచారణ ప్రారంభించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. విచారణకు సంబంధించి మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, హెడ్లకు కమిషన్ సమన్లు జారీ చేయడంతో సెప్టెంబర్ 9న ప్రతినిధులు ఎన్సిపిసిఆర్ ముందు హాజరయ్యారు.
Also Read:వినాయక చవితి..స్పెషల్ వంటకాలు
మెటా యాజమాన్యంలోని ప్లాట్ఫారమ్లలో వచ్చిన ప్రకటనలకు సంబంధించి బిబిసి ఐ (BBC Eye) ప్రచురించిన నివేదిక ఆధారంగా NCPCR సుమోటోగా కేసు స్వీకరించింది. అనంతరం జూలై 3, 2026న మెటా ప్లాట్ఫారమ్లకు నోటీసులు జారీ చేస్తూ వివరణ కోరింది. నోటీసు వచ్చిన వారానికి మెటా కమిషన్కు తన సమాధానాన్ని సమర్పించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కూడా ఈ ఆరోపణలను స్వీకరించి, మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్లో పెయిడ్ యాడ్స్ ద్వారా చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM) ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. పోక్సో (POCSO) చట్టం కింద తప్పనిసరిగా చేయాల్సిన నివేదికల నిబంధనలను మెటా మరియు ఇతర సంస్థలు పాటించాయో లేదో పరిశీలించాలని కూడా ఎన్హెచ్ఆర్సి పోలీసులను కోరింది.

