కొత్త జిల్లాలవారీగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం కేసీఆర్ ఆధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలవారీగానే జిల్లా క్యాడర్ పోస్టుల భర్తీ చేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, జోనల్ వ్యవస్థ, రాష్ట్రపతి ఉత్తర్వులు, తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. జిల్లా కేడర్ పోస్టులను కొత్త జిల్లాల ప్రతిపాదికనే నియమించాలని సీఎం నిర్ణయించారు. ఢిల్లీ వెళ్లి హోంశాఖతో మాట్లాడి ఉత్తర్వులు వచ్చేలా చూస్తానని, ప్రతి నియామకం రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే ఉండాలని ఆయన సూచించారు. విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ నియాకాలు ఇలాగే జరగాలని చెప్పారు.
తెలంగాణలో కొత్తజోన్ల ఏర్పాటు అనివార్యమని, పాతజోన్ల విధానం అమలు ఇప్పుడు సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఏఏ జోన్లలో ఏఏ జిల్లాలు వస్తాయో నిర్థారణకు కమిటీ వేస్తామన్నారు. కమిటీ సిఫార్సుల ఆధారంగా కేబినెట్లో తీర్మానం చేస్తామని పేర్కొన్నారు. ఏ కేడర్ కింద ఏ పోస్టు ఉందో ముందే స్పష్టంగా తెలియాలని, జిల్లా, జోనల్, మల్టీజోనల్, స్టేట్క్యాడర్ పోస్టులు ఉండాలని కేసీఆర్ ఆదేశించారు.