నంద్యాల ఉప ఎన్నికపై ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే వచ్చేసింది. ప్రతిష్ఠాత్మకంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా.. తన టీంతో ఓటింగ్ సరళిపై సర్వే చేయించటం.. పోలింగ్ ముగిసిన వెంటనే ఆ ఫలితాన్ని వెల్లడించటం గడిచిన కొద్ది కాలంగా ఆయనకు అలవాటుగా మారింది. ఇప్పటివరకు ఆయన సర్వేలో చెప్పినవి చెప్పినట్లే జరిగాయి.
ఓటింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో తుది ఫలితంపై తన అభిప్రాయాన్ని చెబుతూ.. ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్నారు. పోలింగ్ పెరిగినప్పటికీ మెజార్టీ మాత్రం 10వేలకు పరిమితమయ్యే అవకాశం ఉందన్నారు. మొత్తం 1,73,335 మంది ఓట్లు వేసిన నేపథ్యంలో గరిష్ఠంగా టీడీపీకి 20వేల ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
పోలింగ్ శాతం పెరగటానికి కారణం.. ఈ ఉప ఎన్నికను అధికార తెలుగుదేశం.. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటమేనని చెప్పారు. నంద్యాలలో టీడీపీకి చంద్రబాబు చేయిస్తున్న అభివృద్ది ప్రదాన బలంగా మారితే… ప్రతిపక్ష నేత జగన్ చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలే ఆ పార్టీకి మైనస్ గా మారాయని లగడపాటి సర్వేలో తేల్చిచెప్పారు.