బల్క్ డ్రగ్ మ్యాన్యూఫాక్చరర్స్ అసోసియేషన్ (బిడియంఏ) ప్రతినిధులతో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఈ రోజు సమావేశం అయ్యారు. ఈ రోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. భారత దేశ ఫార్మ రాజదానిగా హైదరాబాద్ నగరానికి ఉన్న పేరును నిలుపుకునేందుకు అవసరం అయిన అన్ని రకాలైన సహాయ సహాకారాలను అందిస్తామని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఫార్మసిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫార్మసిటీ ఏర్పాటు ద్వారా ఫార్మ అభివృద్దితోపాటు కాలుష్య సమస్యను పూర్తిగా అరికట్టేలా అత్యుత్తమ సాంకేతిక పద్దతులను ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు. దీంతోపాటు కాలుష్యకారక పరిశ్రమలను అవుటర్ రింగు రోడ్డు అవతలకు తరలించడం, క్లస్టర్ల వారీగా అయా పరిశ్రమల అభివృద్దికి ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఫార్మ పరిశ్రమకు ఏల్లప్పుడు చేయూత అందిస్తు వస్తుందని మంత్రి తెలిపారు. మరోవైపు ఫార్మ కంపెనీలు నిర్దేశిత కాలుష్య నియంత్రణ ప్రమణాలు పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడదన్నారు. పటాన్ చెర్వు, బొల్లారం వంటి పారిశ్రామిక కేంద్రాల్లో ఆసుపత్రుల అప్ గ్రేడేషన్ వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు పరిశ్రమ వర్గాలు ముందుకు వచ్చాయి. దీంతోపాటు అయా ప్రాంతాల్లోని చెరువులు, జలవనరుల అభివృద్దిలోనూ పాలు పంచుకోవాలన్న మంత్రి విజ్ఝప్తికి సానుకూలంగా స్పందించారు.
ఈ సమావేశంలో ఫార్మ ప్రతినిధులు తమ కంపెనీల విస్తరణ ప్రణాళికలను మంత్రికి తెలిపారు.
ముఖ్యంగా పరిశ్రమ ఏదుర్కోంటున్న పలు సమస్యలను, సవాళ్లను ప్రభుత్వ సహాకారాన్ని వారు మంత్రికి వివరించారు. దీంతోపాటు తాము అధునాతన సాంకేతిక పరిజ్ఝానాన్ని ఉపయోగించుకునే దిశగా వెళ్తున్నామని, కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించే దిశగా ముందుకు వెళ్తున్నామని బిడియంఏ ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమల అభివృద్దికి కావాల్సిన పలు చర్యలను ప్రభుత్వానికి వారు సూచించారు. జీడిమెట్ల అప్లూయంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ను అప్ గ్రేడ్ చేయాలని మంత్రిని కోరారు. హైదరాబాద్ ఫార్మసిటీ ద్వారా ఫార్మ రంగంలో తెలంగాణ స్ధానం మరింత సుస్ధిరం అవుతుందని ఫార్మ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ఛీప్ అడ్వయిజర్ రాజీవ్ శర్మ, పిసిబి సభ్య కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ఇతర ముఖ్య అధికారులున్నారు.