KTR:కేంద్రంకు చిత్తశుద్ధి లేదు: కేటీఆర్‌

40
- Advertisement -

వైజాగ్ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ప్రకటన కేవలం ప్రజల దృష్టి మరలించే చర్యగా మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేవలం అదానీకి చత్తీస్ గఢ్, ఒరిస్సాలోని బైలదిల్లా మైన్స్ అక్రమంగా కేటాయింపుల నుంచి దృష్టి మరలించేందుకు చేస్తున్న ప్రయత్నమని మండిపడ్డారు. నిజంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతంపైన చిత్తశుద్ధి ఉంటే దానికి వెంటనే డెడికేటెడ్ క్యాప్టివ్ ఐరన్ గనులను కేటాయించాలని అందుకోసం కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు.. తెలంగాణ ప్రజల హక్కు అయిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గొడ్డలిపెట్టుగా మారిన అదానీ బైలదిల్లా ఇనుప ఖనిజ గనుల కేటాయింపు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కుట్రపూరిత వైఖరిని తాము బయట పెట్టిన నేపథ్యంలోనే కేంద్రం ఈ కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తీరుగా అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఖమ్మంలోని బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పాతర వేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాడాన్ని ప్రజలు ఏమాత్రం ఉపేక్షించరు అని అన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు భారత రాష్ట్ర సమితిగా మా పార్టీ నిరంతరం పోరాడుతుందని అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే విషయంలో చిత్తశుద్ధిని చాటుకుంటూ.. మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ జారీ చేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ) లో పాల్గొంటామని చేసిన ఒక్క ప్రకటన నేపథ్యంలోనే కేంద్రం వెనక్కి తగ్గిందని కేటీఆర్ అన్నారు.

కేసిఆర్ ఒక్క మాట మాట్లాడితే ఎవరైనా దిగి రావాల్సిందేనని మరోసారి నిరూపితమైందని కేటీఆర్ అన్నారు. అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా విరమించుకునే దాకా, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసే దాకా కేంద్ర ప్రభుత్వం పైన నిరంతరం ఒత్తిడి పెంచుతూనే ఉంటామని కేటీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి…

కేసీఆర్‌ నిర్ణయంతో కేంద్రం దిగొచ్చింది :కేటీఆర్‌

ప్రకాష్ అంబేద్కర్‌కు స్వాగతం పలికిన విప్ బాల్క సుమన్‌…

HMDA:హెచ్ఎండిఏకు అవార్డుల పంట..

- Advertisement -