దీదీకి మద్దతు పలికిన జయాబచ్చన్..!

173
jaya
- Advertisement -

పశ్చిమబెంగాల్ ఎన్నికలు యుద్ధరంగాన్ని తలపిస్తున్నాయి. టీఎంసీ అధినేత్రి మమతాదీదీకి చెక్‌పెట్టి ఈసారి ఎలాగైనా బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని మోదీ, అమిత్‌షాలు పట్టుదలగా ఉన్నారు. తొలుత టీఎంసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను డబ్బు సంచులతో ప్రలోభపెట్టి తమ పార్టీలోకి లాక్కుని దీదీని దెబ్బకొట్టాలని చూశారు. జై శ్రీరామ్ నినాదాలతో బెంగాలీలలో హిందూత్వ సెంటిమెంట్‌ను రగిలించి మమతను చికాకు పెట్టాలని చూశారు. దీదీ మేనల్లుడు అభిషేక్ ముఖర్జీ కుటుంబసభ్యులపై సీబీఐ, ఐటీని ఉసిగొల్పి దాడులు చేయించి భయపెట్టాలని చూశారు. అయితే కాలి గాయంతో దెబ్బతిన్న పులిలా దీదీ బెంగాల్ అంతటా వీల్‌ఛైర్‌లో కూర్చునే ప్రచారం చేస్తూ ఒక్క కాలంతో బెంగాల్‌లో గెలుస్తా..ఆ తర్వాత రెండు కాళ్లతో ఢిల్లీనిగెలుస్తా అంటూ సవాల్ విసురుతున్నారు.

ఈ నేపథ్యంలో టీఎంసీకి మద్దతుగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ బెంగాల్‌లో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా భయం కారణంగా బెంగాలీలెప్పుడూ తమ తలలను ఇతరుల ఎదుట వంచలేదు. బెంగాలీలను భయపెట్టి ఎవరూ ఇంతవరకు గెలవలేదు..అంటూ జయాబచ్చన్ మోదీ, అమిత్‌షాలకు కౌంటర్ ఇఛ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, జేఎంఎం, సమాజ్‌వాదీ వంటి పార్టీలు సైతం టీఎంసీకి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఆదేశాల మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా జయాబచ్చన్ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గురించి జయా బచ్చన్‌ మాట్లాడారు. మమతా అనుకున్నది సాధిస్తారని అన్నారు. ” మమతా బెనర్జీ మీద నాకెంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. అన్ని రకాల దాడులకు వ్యతిరేకంగా ఆమె ఒక్కరే పోరాడుతున్నారు. తల పగిలినా, కాలు విరిగినా.. ఆమె గుండె ధైర్యం, మనో నిబ్బరం మాత్రం సడలడంలేదు” అని కొనియాడారు.

దీదీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని జయాబచ్చన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మమతా తిరిగి గెలుస్తారని అన్నారు. రాష్ట్రానికి వెలుపల జన్మించినప్పటికీ, తాను బెంగాలీనేనని జయా బచ్చన్‌ తెలిపారు. పెళ్లికి ముందు వరకూ తన ఇంటి పేరు భాదురి అన్న సంగతిని పేర్కొన్నారు.. బెంగాల్‌ ప్రజాస్వామ్య హక్కుల కోసం మమతా పోరాడుతున్నారని ప్రశంసించారు. రవీంధ్రనాధ్‌ ఠాగూర్‌ సైతం బెంగాలీలంతా అక్కాచెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లని చెప్పారని గుర్తు చేశారు. బెంగాల్‌ ప్రస్తుతం మహిళలకు సురక్షితంగా ఉందన్నారు. మమతాను అసభ్యపదజాలంతో దూషించిన బీజేపీ నేతలపై స్పందిస్తూ.. సిగ్గు సిగ్గు.. అని వ్యాఖ్యానించారు. మొత్తంగా భయపెట్టి బెంగాల్ ప్రజలను గెలవలేరు అంటూ బీజేపీపై జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

- Advertisement -