పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రధాన కార్యాలయాన్ని రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం స్వాధీనం చేసుకోవడంతో పార్టీ నియంత్రణ కోసం సాగుతున్న పోరు తీవ్రరూపం దాల్చింది. కార్యాలయంలోకి ప్రవేశించిన తిరుగుబాటు వర్గం.. అక్కడి తాళాలను మార్చేసి కొత్త పోస్టర్లను అంటించింది. అనంతరం ఒక సమావేశాన్ని నిర్వహించి ఇప్పటి నుండి ఈ భవనం తమ నియంత్రణలోనే ఉంటుందని ప్రకటించింది.
కోల్కతాలోని 30B హరీష్ ఛటర్జీ స్ట్రీట్లో ఉన్న ఈ ‘టీఎంసీ భవన్’ పార్టీకి అత్యంత ముఖ్యమైన ప్రధాన కార్యాలయం. ఈ భవనం వ్యాపారవేత్త మనోతోష్ సాహాకు చెందినది. రితబ్రత బెనర్జీతో పాటు ఫిర్హాద్ హకీమ్, జావేద్ ఖాన్, సందీపన్ సాహా, అఖ్రుజ్జమాన్లు టీఎంసీ భవన్కు చేరుకుని తమదే అసలైన టీఎంసీ అని ప్రకటించారు. మేమే నిజమైన తృణమూల్ కాంగ్రెస్. ఇది మా ప్రధాన కార్యాలయం అని రితబ్రత పేర్కొన్నారు. శనివారం నుండి ఈ భవనం నుంచే తమ వర్గం కార్యకలాపాలు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
అయితే 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా (LoP) ఉన్న రితబ్రతపై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్గం పోలీసులకు ఫిర్యాదు చేయనుంది. అక్రమంగా చొరబడి భవనాన్ని బలవంతంగా ఆక్రమించుకుందని ఆరోపిస్తూ భారత ఎన్నికల సంఘానికి (ECI) కూడా లేఖ సమర్పించనున్నట్లు తెలిపింది.
మమతా బెనర్జీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయిన కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. పార్టీ నుండి బహిష్కరణకు గురైన నాయకులకు (రితబ్రతను ఉద్దేశిస్తూ) పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించే హక్కు లేదని మండిపడ్డారు. ఈ విషయమై మేము ఇప్పటికే పోలీసులకు విజ్ఞప్తి చేశాం” అని ఘోష్ విలేకరులతో అన్నారు. టీఎంసీని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రగా దీనిని ఆయన అభివర్ణించారు. వారు వేసిన తాళాలను మేము సులభంగానే పగులగొట్టగలము కానీ చట్టవిరుద్ధమైన లేదా బాధ్యతారహితమైన పనులకు మేము దూరంగా ఉన్నాం అని చెప్పారు.
Also Read:SIR పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ: కేటీఆర్
15 ఏళ్ల తర్వాత మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోయిన అనంతరం రితబ్రత.. టీఎంసీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 64 మంది మద్దతు తనకే ఉందని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. ఈయన అడుగుజాడల్లోనే టీఎంసీకి చెందిన 28 మంది లోక్సభ సభ్యులలో 20 మంది మమతపై తిరుగుబాటు చేయడంతో పార్టీలో చీలిక ఏర్పడి మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది.

