ప్రధానికి సంయుక్త కిసాన్ మోర్చా లేఖ..

62
modi
- Advertisement -

కొత్తగా తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన కిసాన్ మోర్చా సమావేశంలో ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించారు రైతు సంఘాల నేతలు. ఈ నేపథ్యంలో పలు డిమాండ్లతో కూడిన లేఖను ప్రధానమంత్రి నరేంద్రమోడికి రాశారు.

1.మొత్తం సాగు ఖర్చు (సి2+50 శాతం) ఆధారంగా “కనీస మద్దతు ధర” ను అన్ని వ్యవసాయ ఉత్పత్తులపై రైతులందరికీ చట్టబద్ధమైన హక్కును కల్పించాలి.తద్వారా దేశంలోని ప్రతి రైతు కు “కనీస మద్దతు ధర” తప్పనిసరిగా లభించే భరోసా ప్రభుత్వం కల్పించాలి. (మీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ సిఫార్సును 2011లో అప్పటి ప్రధానికి అందించింది. ఆ మేరకు, మీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన కూడా చేసింది.

ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం సవరణ బిల్లు-2020, 2021 ముసాయిదాను ఉపసంహరించుకోవాలి. రైతుల‌కు ప్ర‌భుత్వానికి జ‌రిగిన చర్చల సమయంలో దానిని ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ దానిని ధిక్కరిస్తూ పార్లమెంటు ఎజెండాలో చేర్చింది. క్యాపిటల్ రీజియన్, అనుబంధ ప్రాంతాల్లో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటి మేనేజ్‌మెంట్ యాక్ట్- 2021 లో రైతులకు శిక్ష విధించే నిబంధనలను తొలగించాలి. ఈ ఏడాది ప్రభుత్వం కొన్ని రైతు వ్యతిరేక నిబంధనలను తొలగించింది. కానీ మరలా సెక్షన్ 15 ద్వారా రైతులకు శిక్ష విధించే నిబంధ‌నను చేర్చింది.

2.“మీ ప్ర‌సంగంలో రైతులు చేసిన ఈ మూడు ప్రధాన డిమాండ్లపై ఖచ్చితమైన ప్రకటన లేకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ఈ చారిత్రాత్మక ఉద్యమం ద్వారా మూడు చట్టాల రద్దు మాత్రమే కాకుండా, కష్టపడి పండించిన పంటకు లాభదాయకమైన ధర లభిస్తుందనే హామీ ఇస్తారని రైతులు ఆశించారు”.

చారిత్రాత్మక ఉద్యమం కొనసాగుతున్న క్రమంలోనే మరికొన్ని సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేసినట్లు” లేఖ‌లో ప్రస్తావించింది “ఎస్‌కెఎం”.

3.రైతు ఉద్యమంలో (జూన్ 2020 నుండి ఇప్పటి వరకు) ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌తో స‌హా అనేక ఇతర రాష్ట్రాల్లో వేలాది మంది రైతులపై వందలాది కేసులు పెట్టారు. ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.

4.లఖింపూర్ ఖేరీ హత్యకేసు సూత్రధారి, సెక్షన్ 120బిలో నిందితుడైన అజయ్ మిశ్రా ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతూ మీ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. మీతో పాటు ఇతర సీనియర్ మంత్రులతో కూడా వేదిక పంచుకుంటున్నారు. అతన్ని బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలి.

5.రైతు ఉద్యమంలో ఇప్పటివరకు సుమారు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు పరిహారం, పునరావాసం కల్పించే వ్యవస్థ ఉండాలి. అమరవీరులైన రైతుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మించేందుకు సింఘూ సరిహద్దులో భూమి ఇవ్వాలి.

6.మీరు రైతులు ఇంటికి తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వీధుల్లో రోడ్ల‌పై కూర్చోవడం మాకు కూడా ఇష్టం లేదు. మేము మీకు హామీ ఇస్తున్నాం. ఈ ఆరు అంశాలను, సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించిన తర్వాత, సత్వరమే మేము మా ఇళ్ల‌కి, కుటుంబాలకు, వ్యవసాయం చేసుకునేందుకు తిరిగి వెళ్లాల‌ని కోరుకుంటున్నాం. మీరు కూడా అదే కావాలని కోరుకుంటున్నట్లయుతే, పైన పేర్కొన్న ఆరు అంశాలపై ప్రభుత్వం వెంటనే “ఎస్‌కెఎం”తో చర్చలు పునఃప్రారంభించాలి. అప్పటి వరకు “ఎస్‌కెఎం” ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది” అని ప్ర‌ధాని మోడీకి రాసిన లేఖ‌లో పేర్కొంది.

- Advertisement -