ఢిల్లీ పరిసర ప్రాంతాలైన నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్లలో గురువారం భారీ వర్షం మరియు తీవ్రమైన ఉరుములతో కూడిన తుఫాను బీభత్సం సృష్టించాయి. దీంతో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఎండ తీవ్రత మరియు ఉక్కపోత నుండి ప్రజలకు భారీ ఉపశమనం లభించింది. భారత వాతావరణ శాఖ మొదట ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేసినప్పటికీ….ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారడం….బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో వాతావరణ శాఖ దానిని ‘రెడ్’ వార్నింగ్గా అప్గ్రేడ్ చేసింది.
వాతావరణ శాఖ ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, మరియు గుర్గావ్లకు ‘ఆరెంజ్’ అలర్ట్ ప్రకటించింది. నోయిడాలోని పలు ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. జూన్ 6 వరకు నగరంలో ఒకటి లేదా రెండు సార్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 40°C నుండి 42°C మధ్య నమోదయ్యే అవకాశం ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 29.7°C గా ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళల్లో బలమైన ఈదురుగాలులు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మధ్యస్థ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే రాత్రి సమయంలో కూడా ఉరుములతో కూడిన మరో విడత తేలికపాటి వర్షం కురవవచ్చని ఐఎండీ అంచనా వేసింది.
శుక్రవారం ఉష్ణోగ్రతలు పగటిపూట 39°C నుండి 41°C మధ్య, రాత్రి వేళల్లో 25°C నుండి 27°C మధ్య నమోదవుతాయి. వాతావరణ శాఖ ‘యెల్లో’ అలర్ట్ జారీ చేస్తూ…ఉదయం పూట గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం పడుతుందని తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కూడా మరోసారి మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
Also Read:FD డిటైల్స్ మర్చిపోయారా..అయితే మీకోసమే?
దేశంలో నాలుగు నెలల పాటు సాగే వర్షకాలానికి నాంది పలుకుతూ, నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ తీరాన్ని తాకినట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా అనుకున్న సమయం కంటే మూడు రోజులు ఆలస్యంగా ఇవి కేరళలోకి ప్రవేశించాయి. మే 15 నాటి అంచనాల ప్రకారం, మే 26 నాటికి రుతుపవనాలు కేరళకు చేరుకోవాల్సి ఉంది.

