కొవాగ్జిన్‌ టీకాకు కేంద్ర నిపుణుల కమిటీ ఆమోదం..

181
Covaxin
- Advertisement -

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన ఆమోదం తెలపాలని డీసీజీఐకి సిఫారసు చేయగా ఈ మేరకు శనివారం కేంద్ర గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొవాగ్జిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి తెరలేచిన నేపథ్యంలో, భారత్‌లో కూడా ఈ దిశగా చర్యలు ఊపందుకున్నాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ) నిపుణులు బృందం పలు దఫాలుగా సమావేశమై వ్యాక్సిన్‌లకు అత్యవసర అనుమతులపై చర్చించింది. నిన్న జరిగిన సమావేశంలో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్‌కు అనుమతి ఇచ్చింది.

తాజాగా ఈరోజు జరిగిన భేటీలో భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌కు ఆమోదం తెలిపింది. దాంతో భారత్‌లో ఇప్పటివరకు అనుమతులు పొందిన కరోనా వ్యాక్సిన్‌ల సంఖ్య రెండుకు చేరింది. అయితే, ఈ రెండు వ్యాక్సిన్‌లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తుది అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపిన నేపథ్యంలో డీసీజీఐ అనుమతి లాంఛనమేనని భావిస్తున్నారు.

- Advertisement -